ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అలాంటోళ్లను వదిలేది లేదు.. నాదెండ్ల మనోహర్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 13, 2024, 09:14 PM

ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నాదెండ్ల మనోహర్.. శాఖపై తన మార్క్ చూపిస్తున్నారు. ఓ వైపు అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూనే.. మరోవైపు క్షేత్రస్థాయిలో తనిఖీలు, సోదాలతో ఉరుకులు పరుగులు తీయిస్తున్నారు. ఇక ఇటీవలే ఢిల్లీ వెళ్లి మరీ.. తమ శాఖ ప్రతిపాదనలను కేంద్రం ముందు ఉంచారు. అలాగే ధాన్యం బకాయిలను సైతం రైతుల ఖాతాల్లోకి విడుదల చేయించి మంచి పేరు తెచ్చుకున్నారు. తాజాగా బియ్యం అక్రమ రవాణాపై మంత్రి నాదెండ్ల మనోహర్ ఫోకస్ పెట్టారు. రోజుకో ప్రాంతంలో పర్యటిస్తూ సోధాలు జరుపుతున్న నాదెండ్ల మనోహర్.. అక్రమార్కుల గుండెళ్లో రైళ్లు పరిగెట్టిస్తున్నారు. ఎవరైనా రేషన్ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నట్లు తేలితే కేసులు పెడతామని, అరెస్ట్ చేస్తామని నాదెండ్ల వార్నింగ్ ఇచ్చారు.


 మరోవైపు గతంలో రేషన్ బియ్యం అక్రమంగా తరలించిన వారికి 41ఏ కింద నోటీసులు ఇస్తామని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. అలాగే అక్రమ రవాణాను అడ్డుకునేందుకు కీలక ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తామని.. చెక్ పోస్టుల వద్ద అదనపు సిబ్బందిని కూడా ఏర్పాటు చేస్తామని మంత్రి వివరించారు. చెక్ పోస్టుల ఏర్పాటు, తనిఖీల విషయంలో తగ్గేది లేదని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. అలాగే రేషన్ బియ్యం అక్రమ సరఫరా మీద త్వరలోనే సీఎం చంద్రబాబుతో చర్చించనున్నట్లు మనోహర్ వెల్లడించారు. రేషన్ బియ్యం సరఫరాలో అక్రమాలకు పాల్పడిన వారిపై సీఐడీతో పాటుగా ఇతర దర్యాప్తు సంస్థలతోనూ దర్యాప్తు చేయిస్తామని స్పష్టం చేశారు.


మరోవైపు కొంత మంది వ్యాపారులు ఇతర రాష్ట్రాలకు వెళ్లి వ్యాపారం చేసుకుంటామంటున్న విషయం తమ దృష్టికి వచ్చిందన్న నాదెండ్ల మనోహర్ .. ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారా అంటూ మండిపడ్డారు. నిబంధనలకు లోబడి న్యాయంగా వ్యాపారం చేసుకునేవారికి ప్రభుత్వం అండగా ఉంటుందని.. వారి జోలికి వెళ్లమని స్పష్టం చేశారు. అలా కాకుండా అక్రమార్జన కోసం దోచుకుంటామనే వ్యాపారులను వదిలేది లేదని తెల్చిచెప్పారు. కీలకమైన ప్రాంతాలను గుర్తించి కొత్త చెక్‌పోస్టుల నిర్మాణంతో పాటుగా.. తనిఖీల విషయంలో ఏ మాత్రం తగ్గమని స్పష్టం చేశారు. ఇక నుంచి యాంకరేజి చెక్‌పోస్టుల వద్ద 24 గంటలూ సిబ్బంది విధుల్లో ఉంటారని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com