ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో రైతుల అకౌంట్‌లలోకి డబ్బులు జమ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 12, 2024, 09:33 PM

ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు శుభవార్త.. ఎన్నో రోజుల ఎదురుచూపులకు పుల్‌స్టాప్ పడింది. గత రబీలో ధాన్యం విక్రయించిన రైతులకు.. మొత్తం రూ.674.47 కోట్ల బకాయిలను ఇవాళ పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ విడుదల చేస్తారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం.. మొత్తం 84,724 మంది రైతులకు రూ.1,674.47 కోట్ల బకాయిలు చెల్లించలేదు. ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం.. రైతుల ఇబ్బందులు గమనించి గత నెలలో 49,350 మందికి రూ.1,000 కోట్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో మిగిలిన 35,374 మందికి రూ.674.47 కోట్ల బకాయిలను తాజాగా విడుదల చేస్తున్నారు. అమలాపురంలో నిర్వహించే కార్యక్రమంలో మంత్రి మనోహర్‌ పాల్గొని రైతులకు చెక్కులు పంపిణీ చేస్తారు.


గతేడాది ఖరీఫ్‌లో ధాన్యం అమ్మకాలకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే కొంత ధాన్యం వర్షానికి దెబ్బ తినగా.. మంచి ధాన్యాన్ని కొనకుండా ఆలస్యం చేశారనే విమర్శలు వచ్చాయి. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసరికి ఒక్క ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే సుమారు రూ.200 కోట్ల బకాయిలు ఉన్నాయి. దీంతో రైతులు ముఖ్య మంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ దృష్టికి తమ సమస్యను తీసుకెళ్లారు. వెంటనే స్పందించి తొలి విడతలో రూ.వెయ్యి కోట్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే.


గత ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం సేకరించి రూ.2,763 కోట్లు బకాయిలు పెట్టిందన్నారు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌. రాష్ట్రంలో రైతుల బకాయిలు చెల్లించడాన్నే అత్యంత ప్రాధాన్య అంశంగా తీసుకుని చెల్లిస్తామన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయని.. ఈ ధర నుంచి ప్రజలకు ఉపశమనం కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది అన్నారు. రైతు బజార్ల ద్వారా నాణ్యమైన కందిపప్పు, బియ్యాన్ని రాయితీపై ప్రజలకు అందిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం ధాన్యం సేకరణ పేరిట సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి రూ.39,550 కోట్లు అప్పులు చేసిందన్నారు. అయితే రుణాలు తెచ్చిన జగన్ ప్రభుత్వం రైతుల బకాయిలు మాత్రం చెల్లించలేదని..కూటమి ప్రభుత్వం వచ్చాక రైతులకు బకాయిలు చెల్లిస్తోందన్నారు.


గత ప్రభుత్వం మార్చి, ఏప్రిల్‌ నెలల్లో ధాన్యం సేకరణ చేసిందని.. ఆ బకాయిలు చెల్లించకుండా రైతుల్ని ఇబ్బందులకు గురిచేసిందన్నారు మాజీ మంత్రి పితాని సత్యనారాయణ. రబీ పెట్టుబడి సొమ్ములు రాక బ్యాంకు రుణాలకు వడ్డీ కట్టలేక.. ప్రస్తుతం సార్వాకు పెట్టుబడి పెట్టలేక రైతులు అవస్థలు పడ్డారన్నారు. ఈ సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబు, పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ దృష్టికి తీసుకెళ్లామన్నారు. వెంటనే స్పందించి ఇప్పటికే రూ.వెయ్యి కోట్లు విడుదల చేయగా.. తాజాగా మిగిలిన బకాయిల్ని కూడా చెల్లిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com