ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అదానీ స్టాక్స్ పడిపోతాయా? మార్కెట్ నిపుణుల సమాధానమిదే

business |  Suryaa Desk  | Published : Sun, Aug 11, 2024, 09:41 PM

అమెరికా షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ మరోసారి అదానీ గ్రూప్‌ని టార్గెట్ చేసి తీవ్ర ఆరోపణలు చేసింది. అయితే, ఈసారి సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా చైర్ పర్సన్ మాధుబి పురి బచ్‌ని ఈ అంశంలోకి తీసుకొచ్చింది. అదానీ గ్రూప్ మారిషస్ ఆఫ్‌షోర్ ఫండ్స్‌లో సెబీ చీఫ్‌, ఆమె భర్తకు వాటాలు ఉన్నాయంటూ సంచలన ఆరోపణలు చేసింది. ఈ మేరకు కొత్త ఇన్వెస్ట్‌గేటివ్ రిపోర్ట్ విడుదల చేసింది. ఈ క్రమంలో ఇప్పుడు అదానీ గ్రూప్ కంపెనీల స్టాక్స్ పనితీరుపై చర్చకు దారితీసింది. సోమవారం ఆగస్టు 12వ తేదీన స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌లో అదానీ గ్రూప్ కంపెనీల స్టాక్స్ పతనమయ్యే అవకాశం ఉందా? అనేది ఇన్వెస్టర్లలో ఆందోళన నెలకొంది. మరి ఈ అంశంపై మార్కెట్ నిపుణులు ఏమంటున్నారు?


2023లో అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ అదానీ గ్రూప్‌పై తీవ్ర ఆరోపణలు చేసింది. కృత్రిమంగా షేర్ల విలువను పెంచి లాభపడిందని, స్టాక్ మార్కెట్ నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడినట్లు తీవ్ర ఆరోపణలు చేసింది. ఆ ఆరోపణలను గౌతమ్ అదానీ నేతృత్వంలోని గ్రూప్ ఎప్పటికప్పుడు ఖండిస్తూ వచ్చినప్పటికీ ఆ సమయంలో గ్రూప్ కంపెనీల స్టాక్స్ ఒక్కసారిగా కుప్పకూలాయి. సుమారు 100 బిలియన్ డాలర్ల మేర నష్టపోయాయి. అయితే, ఆ తర్వాత తమ ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని కలిగించేందుకు వేగంగా చర్యలు తీసుకున్నారు. దీంతో అదానీ గ్రూప్ షేర్లు వేగంగా కోలుకున్నాయి. హిండెన్‌బర్గ్ ఆరోపణల ముందు సమయంలోని విలువను దాటి ట్రేడింగ్ అవుతున్నాయి.


అదానీ గ్రూప్‌నకు చెందిన 10 కంపెనీలు స్టాక్ మార్కెట్లో లిస్టయ్యాయి. అవి అదానీ పోర్ట్స్ అండే సెజ్, అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ పవర్, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ టోటల్ గ్యాస్, అదానీ విల్మార్, అంబుజా సిమెంట్స్, ఏసీసీ, ఎన్‌డీటీవీ ఉన్నాయి. తాజా ఆరోపణలపై స్టాక్ మార్కెట్ నిపుణులు స్పందిస్తున్నారు. 2023తో పోలిస్తే ప్రస్తుత పరిస్థితులు వేరని గుర్తు చేశారు. హిండెన్‌బర్గ్ తాజా ఆరోపణల ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చన్నారు. సోమవారం నాటి ట్రేడింగ్‌లో అదానీ స్టాక్స్‌లో భారీ అమ్మకాలు ఉండకపోవచ్చని, అలాగే స్టాక్ మార్కెట్ సైతం భారీ నష్టాల్లోకి వెళ్లే అవకాశాలేమీ ఉండకపోవచ్చని నమ్ముతున్నట్లు చెప్పారు.


'హిండెన్‌బర్గ్ లేటెస్ట్ రిపోర్ట్ కారణంగా భారత స్టాక్ మార్కెట్లపై భారీ ప్రభావం ఉంటుందని నేను అనుకోవట్లేదు. మొదట్లో ప్రభావం కనిపించవచ్చు కానీ, మార్కెట్లో కొనుగోళ్లు ఉంటాయి. అలాగే అదానీ గ్రూప్ స్టాక్స్‌పైనా పెద్ద ప్రతికూల ప్రభావం ఉండకపోవచ్చు. మార్కెట్లు ప్రారంభమైన తర్వాత అదానీ స్టాక్స్ కాస్త ఒత్తిడికి గురికావచ్చు. కానీ, మళ్లీ రికవరీ అవుతాయి.' అని ఇండిట్రేడ్ క్యాపిటల్ ఛైర్మన్ బందోపాధ్యాయ్ పేర్కొన్నట్లు మింట్ వెల్లడించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com