ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్లకు సంబంధించి రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామి శుభవార్త చెప్పారు. గతంలో అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వం ఆగష్టు 2023 నుంచి 2024 ఆగస్టు వరకు వాలంటీర్లకు రెన్యువల్ చేయలేదన్నారు. రెన్యువల్ లేకుండానే ఉద్యోగాలు చేస్తున్నారని.. వాలంటీర్లు విధులు తాము ఎప్పుడూ తొలగించలేదన్నారు. జగన్ పాప పుణ్యమే వారి జీతాలు ఆగాయని.. తాము ఇస్తామన్నారు. తాము వాలంటీర్లుకు ధృవీకరణ చేయబోతున్నామని ప్రకటించారు మంత్రి. రాష్ట్రంలో వాలంటర్ వ్యవస్థను తొలగిస్తామంటూ వస్తున్న ప్రచారాన్ని మంత్రి స్వామి ఖండించారు.
కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీకి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వాలంటీర్లను రాజకీయంగా ఉపయోగించుకుందన్నారు. వాలంటీర్ల భవిష్యత్తును దెబ్బకొట్టేందుకు ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. గత ప్రభుత్వం ఏడాది కాలంగా వాలంటీర్ సేవలను రెన్యూవల్ చేయకుండా వారిని మోసం చేశారన్నారు. త్వరలోనే వాలంటీర్ల ఉద్యోగాలను రెన్యువల్ చేస్తామని ప్రకటించారు. వాలంటీర్ల విషయంలో ఎలాంటి అనుమానాలు అవసరం లేదన్నారు.
గిరిజనుల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు మంత్రి స్వామి. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. గిరిజనులలో అక్షరాస్యత పెంచేలా చర్యలు తీసుకుంటున్నామని.. ఎస్సీ. ఎస్టీలకు గతంలో టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన పథకాలు మరింత ప్రయోజనం కల్పించేలా పునరుద్ధరిస్తామని తెలిపారు. హాస్టళ్లను గురుకులాలుగా మార్చిన చోట కొన్ని పరిపాలనాపరమైన సమస్యల పరిష్కారానికి త్వరలోనే గిరిజన శాఖ మంత్రితో మాట్లాడి చర్యలు తీసుకుంటామన్నారు. ఐటీడీఏ రీజనల్ ఆఫీసు జిల్లాలో ఏర్పాటుకు కృషి చేస్తానని.. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో పొన్నలూరు, కనిగిరిలో మంజూరు చేసిన గురుకులాల పెండింగ్ పనులను పూర్తిచేసి త్వరలో అందుబాటులో తేస్తామన్నారు. శ్రీశైలం వెళ్లే మార్గాన్ని నాలుగు లైన్ల రోడ్డుగా విస్తరిస్తామని.. అర్హులైన గిరిజనులకు ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు మంజూరు చేస్తామన్నారు మంత్రి. మరోవైపు డీఎస్సీ రాసే ఎస్టీ అభ్యర్థులకు ఉచితంగా వసతి, శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
ఆధార్ నమోదు కేంద్రాన్ని, ఆయూష్ శాఖ ఆధ్వర్యంలో ఔషధ శిబిరాన్ని ఏర్పాటు చేయగా.. మంత్రి స్వామి, ప్రకాశం జిల్లా కలెక్టర్ అన్సారియా ప్రారంభించారు. అనంతరం యర్రగొండపాలెం దోర్నాల, పుల్లలచెరువు మండలాల్లోని 383 మంది చెంచులకు ఆర్వోఎఫ్ఆర్ పట్టాలను పంపిణీ చేశారు. పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన గిరిజన విద్యార్థులకు డిక్షనరీలను అందజేశారు. గిరిజన నాయకులు గిరిజన భవనానికి నాలుగు కూలింగ్ వాటర్ బబుల్స్ను ప్రసాద్ బహూకరించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. మొత్తం మీద వాలంటీర్ల వ్యవస్థ కొనసాగింపుపై మంత్రి స్వామి క్లారిటీ ఇచ్చారు.