ప్రేమ విఫలం కావడంతో ఓ బాలిక ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా, నల్లజర్ల మండలం ఘంటా వారి గూడెంలో జరిగింది. ఘంటా వారి గూడేనికి చెందిన పెనుమాక శ్రీనివాసరావు, సుశీల దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తెకు వివాహం కాగా, చిన్న కుమార్తె లక్ష్మి(17) ఇంటర్ ప్రైవేటుగా చదువుతూ దూబచర్లలోని ఓ మందుషాపులో పనిచేస్తోంది. పక్కనే సెలూ న్ షాపు నిర్వహిస్తున్న ఉంగుటూరు మండలం ఎర్రమిల్లిపాడు గ్రామానికి చెందిన శ్రీనుతో ప్రేమలో పడింది. ఇద్దరూ తరచు కలుస్తుండేవారు. ఇంట్లో విషయం తెలియడంతో వివాహం చేసుకోవాలని లక్ష్మి ఒత్తిడి చేయగా, శ్రీను మొహం చాటేశాడు. తాను మోసపోయానని మనస్తాపం చెందిన లక్ష్మి తన తల్లిదండ్రులు కూలీ పనికి వెళ్లిన తరువాత మధ్యాహ్నం ఫోన్ చేసి మిమ్మల్ని చివరిసారిగా చూడాలనిపిస్తోంది.. త్వరగా ఇంటికి రండి.. చెప్పింది. తల్లిదండ్రులు ఇంటికి వచ్చి చూడగా ఫ్యాన్కు వేలాడుతూ విగ తా జీవిగా కనిపించింది. స్థానికుల సహకారంతో లక్ష్మిని దించి పరిశీలించగా అప్పటికే మృతి చెందినట్టు స్థానిక వైద్యులు పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న ఏఎస్ఐ స్టాలిన్ ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలిస్తుండగా బంధువుల అడ్డుకున్నారు. దీంతో సీఐ దుర్గాప్రసాద్ అక్కడికి చేరుకుని వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ప్రేమికుడు శ్రీను వచ్చి లక్ష్మి కుటుంబానికి న్యాయం చేసేవరకు ఇక్కడే ఉంచాలని మధ్యాహ్నం నుంచి సాయంత్రం 7 గంటల వరకు అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య చర్చలు జరుగుతున్నాయి.