ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బెదిరింపులకు భయపడి విద్యార్థిని ఆత్మహత్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 24, 2024, 09:38 PM

 దేశ వ్యాప్తంగా దసరా వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు దాదాపు పదిరోజుల పాటు స్కూళ్లకు సెలువు ఇచ్చేయడంతో పిల్లలు ఎంతో ఉత్సాహం దసరా సంబరాల్లో పాలుపంచుకున్నారు. కానీ దసరా పండుగకు సెలవులు అడగమే ఓ బాలిక పాలిట శాపంగా మారింది. అందరికీ సెలవులు ఇచ్చినా తమకు ఇవ్వలేదంటూ ఓ బాలిక తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో ఈ విషయాన్ని ఆ తండ్రి జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. అలా చేయడమే ఆ బాలికు శాపంగా మారుతుందని ఊహించలేకపోయింది. చివరకు స్కూల్ యాజమాన్యం చేసిన నిర్వాకంతో బాలిక కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది.ఇంతకీ ఏం జరిగిందంటే.. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పదోతరగతి విద్యార్థిని వెన్నెల ఆత్మహత్య చేసుకుంది. విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలు తెలిసి అంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


సదరు బాలిక అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం చెముడులంక శ్రీ షిర్డీ సాయి విద్యానికేతన్‌లో పదవ తరగతి చదువుతోంది. అందరికీ దసరా సెలవులు ఇచ్చినప్పటికీ.. వీరికి మాత్రం స్కూలు యాజమాన్యం సెలవులు ఇవ్వకుండా స్కూల్‌ను నిర్వహించింది. దీంతో దసరా సెలవులు ఇవ్వకుండా స్కూల్ నిర్వహించడంపై విద్యార్థిని తన తండ్రి ఫోన్‌లో తెలుపగా.. ఆయన జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులకు ఫిర్యాదు చేయటంపై విద్యార్థిని వెన్నెలను స్కూల్ డైరెక్టర్ ఉమారాణి బెదిరించింది. స్కూల్ డైరెక్టర్ బెదిరింపులకు భయపడిపోయిన బాలిక, తీవ్ర మనోవేదనకు గురై బలవన్మరణానికి పాల్పడింది.స్కూల్ డైరెక్టర్ ఉమారాణి తన కుమార్తెను బెదిరిస్తూ, మానసికంగా హింసించడంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు తండ్రి శ్రీనివాస్ ఆరోపించారు. కుమార్తె ఆత్మహత్యపై ఆలమూరు పోలీస్ స్టేషన్‌లో విద్యార్థిని తండ్రి ఫిర్యాదు చేశారు. విషయం తెలిసిన ప్రజా సంఘాలు, విద్యార్థులు సంఘాలు.. విద్యార్థిని కుటుంబసభ్యులు అండగా నిలిచారు. న్యాయం చేయాలంటూ బాలిక స్వగ్రామం చిలకలపాడు నుంచి చెముడులంక వరకు జాతీయ రహదారిపై ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ విషయంపై ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జోక్యం చేసుకొని న్యాయం చేయాలని విద్యార్థిని తండ్రి కోరుతున్నాడు. పదోతరగతి విద్యార్థిని వెన్నెల ఆత్మహత్య సంఘటనపై జిల్లా విద్యాశాఖ అధికారి కమల కుమారి స్పందించారు. వెన్నెల ఆత్మహత్యపై విచారణ జరిపి ఉన్నత స్థాయి అధికారులకు నివేదిక అందజేశామన్నారు. ఈనెల 18 న వెన్నెల ఆత్మహత్య చేసుకుందని తెలిపారు. దసరా సెలవులు తర్వాత ఈనెల 14, 15 తేదీల్లో వెన్నెల స్కూల్‌కు హాజరైందని.. 16, 17, 18 తేదీల్లో విద్యార్థిని పాఠశాలకు వెళ్లలేదన్నారు. వెన్నెల ఆత్మహత్య చేసుకున్న విషయం ఈనెల 22న తమ దృష్టికి వచ్చినట్లు విద్యాశాఖ అధికారి కమల కుమారి పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com