పాల దిగుబడి పెంచడమే ప్రధాన లక్ష్యంగా.. పాడి రైతులకు ఎన్డీఏ ప్రభుత్వ ప్రోత్సాహాకాలు అందిస్తోంది. ఈ మేరకు ఊరూరా పశుగ్రాస క్షేత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పేద రైతుల జీవనోపాధి మెరుగుపరిచేందుకు, పాల దిగుబడి పెంచే లక్ష్యంతో ఎన్డీే ప్రభుత్వం "ఊరూరా పశుగ్రాస క్షేత్రాలు" రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో ప్రారంభించాలని అధికారుల్ని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు.
2014-2019 మధ్య అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పాడి రైతులకు తోడ్పాటును అందించేందుకు "ఊరూరా పశుగ్రాస క్షేత్రాలు" పథకం అమలు చేశారన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. కానీ వైఎస్సార్సీపీ హయాంలో పథకం అమలు చేయలేదని.. పాల సేకరణలో నిబంధనలు విధించి ఇబ్బందులకు గురి చేశారన్నారు. ఉపాధి హామీ పథకంలో ఊరూరా పశుగ్రాస క్షేత్రాల పెంపకం కార్యక్రమాన్ని ఏన్డీఏ ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు.
పశుగ్రాసం పెంపకంలో భాగంగా చిన్న & సన్నకారు రైతులు (అంటే 5 ఎకరాలలోపు గల వారికి) ఉన్న పొలంలో కనీసం 25 సెంట్లు నుంచి 2.5 ఎకరాల వరకు పశుగ్రాసాన్ని పెంచేందుకు దుక్కిదున్నడం, విత్తనం/ గడ్డి కణుపులు నాటడం, నీటిసరఫరా, ఎరువుల కోసం ఆర్థిక ప్రోత్సాహం అందిస్తున్నామని మంత్రి తెలిపారు. వేతన, సామాగ్రి ఖర్చు 2 ఏళ్ల కాల వ్యవధిలో ఒక ఎకరానికి రూ.99 వేలు లబ్ధి చేకూరుతుందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. అర్హులైన ప్రతి రైతుకు ఈ పథకం అమలు చేయాలని ఉపాధి హామీ, పశు సంవర్ధక శాఖ అధికారులను మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు.
మరోవైపు మత్స్యకారులకు ఏపీ ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. మత్స్యకారులకు ఇబ్బందిగా మారిన 217 జీవోను రద్దు చేస్తామని వ్యవసాయ, మత్స్య శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఏపీ అసెంబ్లీలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాది వెంకటేశ్వరరావు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. త్వరలో ఈ జీవో రద్దు అంశాన్ని కేబినెట్లో పెట్టి నిర్ణయం తీసుకుంటామన్నారు. గతంలో ఈ జీవోను రద్దు చేయాలని అనేక ఆందోళనలు జరిగాయని గుర్తు చేశారు.. గతంలో ప్రతిపక్షనేత గా ఉన్న సమయంలో చంద్రబాబు ఈ జీవోను రద్దు చేస్తానని చెప్పిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.
జీవో 217 మత్స్యకారుల ఉనికికి, ఉపాధికి విఘాతం కలిగించేలా ఉందని.. రాష్ట్ర వ్యాప్తంగా 2800 సొసైటీల పొట్టకొట్టే, లక్షలాది మంది మత్స్యకారులు రోడ్డున పడేలా అప్పట్లో గత ప్రభుత్వం 217 జీవోను తీసుకొచ్చిందన్నారు మంత్రి. ఎప్పటి నుంచో చెరువుల్లో చేపలు పట్టుకొని జీవనం సాగిస్తున్న మత్స్యకారులను పట్టించుకోకుండా.. ప్రభుత్వం టెండర్లు పిలిచి దళారులకు దోచిపెట్టేలా ప్రభుత్వం వ్యహారించిందన్నారు మంత్రి అచ్చెన్నాయుడు.