ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కన్వర్ యాత్ర వేళ "మానవత్వం"పై సోనూసూద్‌ ట్వీట్లు,,,కౌంటర్ ఇచ్చిన కంగనా రనౌత్

national |  Suryaa Desk  | Published : Sat, Jul 20, 2024, 10:24 PM

దేశంలో ప్రస్తుతం కన్వర్ యాత్ర గురించే చర్చ జరుగుతోంది. వివిధ రాష్ట్రాల గుండా సాగుతున్న ఈ యాత్రకు సంబంధించి.. ఉత్తర్‌ప్రదేశ్ సర్కార్ విధించిన నిబంధనల పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే యోగి ఆదిత్యనాథ్ తీసుకున్న నిర్ణయంపై ప్రతిపక్షాలు, వివిధ వర్గాల నుంచే కాకుండా.. సొంత పార్టీ, మిత్రపక్షాల పార్టీ నుంచి కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలోనే నటుడు సోనూసూద్ చేసిన ట్వీట్ ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీసింది. అయితే ఈ ట్వీట్‌పై స్పందించిన బీజేపీ ఎంపీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తనదైన స్టైల్‌లో కౌంటర్ ఇచ్చారు. కన్వర్ యాత్ర మార్గంలో ఉన్న దుకాణాల నేమ్ బోర్డులపై మానవత్వం మాత్రమే ప్రదర్శించాలని సోనూసూద్ ఒక ట్వీట్ చేశారు.


అయితే ఈ ట్వీట్‌పై స్పందించిన కంగనా రనౌత్.. దానికి పూర్తిగా అంగీకరిస్తున్నానని పేర్కొంటూనే.. హలాల్ స్థానంలో కూడా మానవత్వం అని రాయాలని కంగనా రనౌత్ ట్వీట్ చేశారు. దీంతో సోనూసూద్, కంగనా రనౌత్ చేసిన ట్వీట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.


ఉత్తర్‌ప్రదేశ్‌లో కన్వర్ యాత్రకు ఆ రాష్ట్ర పోలీసులు పెట్టిన నిబంధనలు దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలకు తావిస్తున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్షాలు తీవ్రంగా విరుచుకుపడుతున్నాయి. ముజఫర్‌నగర్ జిల్లా నుంచి సాగే ఈ కన్వర్ యాత్రా మార్గంలో షాపులు, హోటళ్లు ఇతర దుకాణాల యజమానులు వారి పేర్లను బోర్డులపై ప్రదర్శించాలని యూపీ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు ఈ నిబంధనలే తీవ్ర వివాదానికి కారణం అయ్యాయి. ఇలాంటి నిబంధనలు రాజ్యాంగంపై దాడిగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ప్రియాంకా గాంధీ వాద్రా అభివర్ణించారు. ఇక ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ.. ఈ రూల్స్‌ను దక్షిణాఫ్రికా వర్ణవివక్ష, హిట్లర్ నాజీ రూల్స్‌గా విమర్శించారు.


అంతకుముందు స్పందించిన బాలీవుడ్ పాటల రచయిత జావెద్ అక్తర్.. ముజఫర్‌నగర్ పోలీసులు సమీప భవిష్యత్తులో ఒక నిర్దిష్ట మతపరమైన ఊరేగింపు జరిగే మార్గంలో అన్ని దుకాణాలు రెస్టారెంట్లు, వాహనాలు కూడా యజమాని పేరును రాయాలని ఆదేశాలు ఇచ్చారు ఎందుకు అని ప్రశ్నించారు. జర్మన్‌లో నాజీలు దుకాణాలు, ఇళ్లపై ప్రత్యేక గుర్తు ఉంచేవారని జావెద్ అక్తర్ ట్వీట్ చేశారు.


కన్వర్ యాత్రలో పాల్గొనే యాత్రికుల విశ్వాసం, పవిత్రతను కాపాడేందుకు ఆయా మార్గాల్లో ఉన్న హోటల్‌లు, దుకాణాల బోర్డుల మీద యజమానులు పేర్లను ప్రదర్శించాలని శుక్రవారం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు. ఈ రూల్స్‌పై ముజఫర్ నగర్ పోలీసుల స్పందిస్తూ.. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా, శాంతి భద్రతల సమస్యలు ఏర్పడకుండా ఈ చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. వీటిపైనే ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com