ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చంద్రబాబుపై కేసులన్నీ సీబీఐ, ఈడీకి అప్పగించాలి.. ఏపీ హైకోర్టులో జర్నలిస్ట్ పిటిషన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 06, 2024, 10:32 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటుగా మంత్రులు నారా లోకేష్, పొంగూరు నారాయణ, కింజరాపు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రతో పాటూ టీడీపీ నేతలపై కేసుల్ని సీబీఐ, ఈడీలకు అప్పగించాలని ఏపీ హైకోర్టులో పిల్ దాఖలైంది. వీరితో పాటుగా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, వ్యాపార వేత్తలు లింగమనేని రమేష్, వేమూరు హరికృష్ణ ప్రసాద్‌తో పాటూ పలు కంపెనీలపై నమోదు చేసిన కేసుల్ని అప్పగించాలని కోరారు.చంద్రబాబుతో పాటూ ఇతరులపై స్కిల్‌ డెవలప్‌మెంట్‌, మద్యం, ఏపీ ఫైబర్‌ నెట్, అమరావతి ‌అసైన్డ్‌ భూములు, ఇసుక, అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ అలైన్‌మెంట్‌ సహా కేసులు నమోదయ్యాయని పిల్‌లో గుర్తు చేశారు. ఈ కేసుల్లో పోలీసులు నిష్పాక్షికంగా దర్యాప్తు చేసే పరిస్థితులు లేవని.. నిష్పాక్షిక, పారదర్శక, వేగవంత దర్యాప్తు కోసం.. ఈ కేసుల్ని సీబీఐ, ఈడీలకు అప్పగించాలని సీనియర్ జర్నలిస్ట్ బాల గంగాధర తిలక్‌ ఈ పిల్ దాఖలు చేశారు.


ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల తర్వాత అప్పుడు డీజీపీగా ఉన్న హరీష్ కుమార్ గుప్తా సీఐడీలోని ఆర్థిక నేరాల విభాగానికి తాళాలు వేయించారని పిల్‌లో పేర్కొన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు సహా టీడీపీ నేతలపై నమోదైన కేసుల దర్యాప్తు చేస్తున్న అధికారుల్ని ఆఫీస్‌లోకి అనుమతించలేదన్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాబోతందని గమనించి.. ఆయా కేసులను దర్యాప్తు చేస్తున్న అధికారుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించాన్నారు. డీజీపీ ఇలా చేయడం చట్ట విరుద్ధమన్నారు. ఎన్నికల కౌంటింగ్ జరుగుతుండగానే ఇదంతా జరిగిందన్నారు. చంద్రబాబుపై నమోదైన స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో సీఐడీ నమోదు చేసిన కేసుల ఆధారంగా ఈడీ ఈసీఐఆర్‌ను రిజిస్టర్ చేసిందన్నారు.


చంద్రబాబు సహా ఇతరులపై నమోదైన కేసుల్లో.. సీఐడీ, ఈడీ ఇప్పటి వరకు నమోదు చేసిన కేసుల దర్యా­ప్తును నీరుగార్చేలా వ్యవహరిస్తున్నారని పిల్‌లో పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో హైకోర్టు ఈ కేసులన్నింటి దర్యాప్తును సీబీఐ, ఈడీకి అప్పగించాలని ఏపీ హైకోర్టును కోరారు. ఏపీ బేవరేజస్‌ కార్పొరేషన్‌ అప్పటి ఎండీ హోదాలో డి.వాసుదేవ­రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో మద్యం కుంభకోణంపై సీఐడీ కేసు నమోదు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఆయనపై కక్షసాధిస్తున్నారని.. కేసు కూడా నమోదు చేశారన్నారు.


ఇటు చంద్రబాబుపై ఇసుక కుంభకోణంలో కేసు నమోదు కాగా.. ఆయనపై ఫిర్యాదు చేసి­నందుకు అప్పటి గనుల శాఖ డైరెక్టర్‌ జి.వెంకట రెడ్డిపై కక్షసాధిస్తున్నారన్నారు. తమపై ఫిర్యాదు చేసిన వారందరిపై రెడ్‌బుక్‌ అంటూ అధికారులను బెదిరిస్తున్నారన్నారు. ఈ అంశాలను పరిగణ­నలోకి తీసుకుని చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కేసుల దర్యాప్తును సీబీఐ, ఈడీ దర్యాప్తును పర్యవేక్షించాలని పిల్‌లో హైకోర్టును కోరారు. ఈ కేసుల్లో దర్యాప్తు పురోగతికి సంబంధించి ఎప్పటికప్పుడు స్థాయీ నివేదికలను కోర్టు ముందుంచేలా సీబీఐ, ఈడీలను ఆదేశించాలని పిల్‌లో తిలక్ కోరారు. ఈ పిల్‌లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రలతో పాటు మొత్తం 114 మందిని ప్రతివాదులుగా చేర్చారు. అలాగే సీఎస్,డీజీపీ, హోం శాఖ ముఖ్య కార్యదర్శి, సీఐడీ అదనపు డీజీ, సీబీఐ, ఈడీలు కూడా ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ హోం శాఖ ముఖ్య కార్యదర్శి హరీష్‌ కుమార్‌ గుప్తాను వ్యక్తి గత హోదాలో ప్రతివాదిగా చేర్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com