మాజీ మంత్రి కొడాలి నానికి మరో ఎదురు దెబ్బ తగిలింది. తాజాగా నానిపై గుడివాడ టూ టౌన్ పోలీస్స్టేషన్లో మరో కేసు నమోదైంది. తన తల్లి మరణానికి కారణమయ్యారంటూ గుడివాడ ఆటోనగర్కు చెందిన దుగ్గిరాల ప్రభాకర్ ఇచ్చిన ఫిర్యాదుతో ఏపీ బేవరేజెస్ మాజీ ఎండీ వాసుదేవ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని, గతంలో కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్, ప్రస్తుత తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవి లతా రెడ్డిలపై కేసు నమోదు చేశారు. ముగ్గురిపై 448,427,506 ఆర్ అండ్ డబ్ల్యూ 34 ఐపీసీ సెక్షన్ల కింద పోలీసులు కేసు ఫైల్ చేశారు.కృష్ణా జిల్లా గుడివాడలోని ఓ గోడౌన్ విషయంలో ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని, అప్పటి ఉమ్మడి కృష్ణా జిల్లా జేసీ మాధవీలతపై ఆరోపణలు వచ్చాయి. వాసుదేవరెడ్డి తీరు, కొడాలి నాని అనుచరుల బెదిరింపులతో తన తల్లి మరణించిందని గుడివాడకు చెందిన దుగ్గిరాల ప్రభాకర్ గుడివాడ టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన తల్లి దుగ్గిరాల సీతామహాలక్ష్మి పేరున 2011లో.. బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ లిక్కర్ గోదామును రిజిస్టర్ టెండరులో దక్కించుకున్నట్లు ప్రభాకర్ తెలిపారు. జగన్ సర్కార్ వచ్చిన తర్వాత తమ లీజు అగ్రిమెంటు పూర్తి కాకుండానే బెదిరించి గోదాము ఖాళీ చేయించారని ఆరోపించారు. తన తల్లి వాసుదేవరెడ్డికి ఫోన్ చేస్తే ఆయన పరుష పదజాలంతో దూషించడంతో మనస్తాపానికి గురయ్యారన్నారు. ఈ గోడౌన్ను వైఎస్సార్సీపీ కార్యకర్త పద్మారెడ్డికి కట్టబెట్టేందుకే ఇలా చేశారన్నారు.
ఈ పరిణామాలతో తన తల్లి మనస్తాపం చెంది చనిపోయారని.. ఆమె మరణానికి వాసుదేవ రెడ్డి, కొడాలి నాని, అప్పటి ఉమ్మడి కృష్ణా జిల్లా జేసీ మాధవీలతారెడ్డి, పద్మారెడ్డి, వైఎస్సార్సీపీ నేత నేతలు దుక్కిపాటి శశిభూషణ్, కసుకుర్తి జనార్దన్, పాలడుగు రామ్ప్రసాద్ల బెదిరింపులే కారణంమని ప్రభాకర్ ఆరోపించారు. గ్రామీణ ప్రాంతంలో గోడౌన్కు మెట్రో పాలిటన్ సిటీ రేటు ఇచ్చి ప్రభుత్వ సొమ్మును దోచుకుంటున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే లక్షలాది రూపాయల కుంభకోణాన్ని పూర్తి ఆధారాలతో సిట్కు అందజేసినట్లు దుగ్గిరాల ప్రభాకర్ తెలిపారు.