ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో బీపీసీఎల్ రూ.60 వేలకోట్ల పెట్టుబడి!.. అక్కడ కాదా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 05, 2024, 06:44 PM

ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఆంధ్రప్రదేశ్‍‌లో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ఆసక్తి చూపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వ సంస్థ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) ఏపీలో రూ. 60 వేలకోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు అప్పట్లో వార్తలు వచ్యాయి. బీపీసీఎల్ ఛైర్మన్ కృష్ణకుమార్ సైతం అప్పట్లో సీఎం చంద్రబాబును కలవటంతో ఈ వార్తలు మరింత జోరందుకున్నాయి. మచిలీపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీ ఏర్పాటు పక్కా అంటూ వార్తలు వెలువడ్డాయి. అయితే ఇప్పుడు పరిస్థితి మారినట్లు కనిపిస్తోంది. బీపీసీఎల్ రిఫైనరీ ప్రాజెక్టు మచిలీపట్నం నుంచి నెల్లూరు జిల్లా రామాయపట్నం వెళ్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇటీవల వెల్లడించారు. స్వర్ణాంధ్ర 2047 విజన్ యాక్షన్ ప్లాన్ వర్క్ షాపులో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇటీవల పాల్గొన్నారు. ఈ సందర్భంగానే బీపీసీఎల్ రిఫైనరీ ఏర్పాటుపై కీలక వ్యాఖ్యలు చేశారు.


నెల్లూరు జిల్లా రామాయపట్నం పోర్టులో బీపీసీఎల్ రూ.50 వేలకోట్లు నుంచి రూ.60 వేలకోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు నెల్లూరు ఎంపీ తెలిపారు. ఈ పెట్టుబడితో బీపీసీఎల్ ఇంటిగ్రేటెడ్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్స్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. వచ్చే 25 ఏళ్లల్లో రాష్ట్రాన్ని అన్నిరకాలుగా అభివృద్ధి చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ప్రణాళికలు రచిస్తున్నారన్న ఎంపీ.. చంద్రబాబు నాయకత్వం మీద నమ్మకంతో అనేక మంది వ్యాపారవేత్తలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారన్నారు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వ సంస్థ బీపీసీఎల్ సైతం రామాయపట్నంలో ఇంటిగ్రేటెడ్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్స్ కాంప్లెక్స్ ఏర్పాటు చేసేందుకు ముందుకువచ్చినట్లు వెల్లడించారు. నెల్లూరు జిల్లాకు మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేలా, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా అధికారులు యాక్షన్ ప్లాన్ రూపొందించాలని వేమిరెడ్డి కోరారు.


మరోవైపు బీపీసీఎల్ రిఫైనరీ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి మూడు ప్రాంతాలను ప్రతిపాదించింది. కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం గ్రీన్ ఫీల్డ్ పోర్ట్, నెల్లూరు జిల్లా రామాయపట్నం పోర్టు, శ్రీకాకుళం జిల్లాలోని మూలపేట ప్రాంతాలను ప్రతిపాదించినట్లు తెలిసింది. ఈ ప్రాంతాల్లో భూమిని కేటాయించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. అయితే ఎక్కడ ఏర్పాటు చేస్తారనే దానిపై బీపీసీఎల్ నుంచి కానీ.. కేంద్రం నుంచి కానీ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే వేయి ఎకరాల విస్తీర్ణంలో రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ నిర్మించాలని బీపీసీఎల్ భావిస్తోంది. ఈ యూనిట్ ద్వారా ఏడాదికి 12 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేయాలని ప్రణాళికలు రచిస్తోంది. అయితే బీపీసీఎల్ రిఫైనరీ ఏర్పాటు చేయాలంటే 5 వేల ఎకరాలు అవసరమవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com