ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయవాడ దుర్గమ్మ ఆలయంలో ఆషాడమాసోత్సవాలు ప్రారంభం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 06, 2024, 09:33 PM

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ సన్నిధిలో ఆషాడ మాసోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ఆగస్టు 4 వరకు ఈ మాసోత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. తొలిరోజు అమ్మవారికి వైదిక కమిటీ సభ్యులు సారెను సమర్పించారు. ముందుగా మేళ తాళాలతో మంగళ వాయిద్యాలతో అమ్మవారికి కమిటీ సభ్యులు పసుపు, కుంకుమ, చీర, జాకెట్, చలిమిడి, గోరింటాకుతో సారెను తీసుకెళ్లి అమ్మవారికి సమర్పించారు. ఇవాళ ఆషాడ మాసం తొలిరోజు కావడంతో భక్తుల రద్దీ పెరిగింది. ఆషాడ మాసోత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అమ్మవారికి సారె సమర్పించేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఆషాడమాసోత్సవాలు ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తారు. ఆషాడమాసంలో ఆడపిల్లలు పుట్టింటికి వస్తారు.. అలాగే దుర్గమ్మను కూడా తమ ఇంటి ఆడపడుచుగా భావించి చీరె,సారె, పూజ సామగ్రి సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు, భవానీ దీక్షలు, శ్రావణమాసంలో నిర్వహించే ఉత్సవాల తర్వాత ఆషాడమాసోత్సవాలకు ప్రాముఖ్యత ఉంది. ఈసారి నేటి నుంచి ఆగస్టు 4 వరకు జరుగుతాయి.. నెల రోజుల పాటూ ఇంద్రకీలాద్రిపై పండగ వాతావరణం కనిపిస్తుంది. భక్త బృందాల సారెలు సమర్పిస్తారు, వారాహి నవరాత్రులు, శాకంబరీ ఉత్సవాలతో సహా దుర్గమ్మకి బోనాలు కూడా సమర్పించడం ఆనవాయితీ. ఆషాడమాసోత్సవాల సందర్భంగా.. ఆలయ మహా మండపం ఆరో అంతస్తులో అమ్మవారి ఉత్సవ మూర్తిని ప్రతిష్టిస్తారు.


ఆషాడమాసోత్సవాలకు తరలివచ్చే భక్తుల కోసం ఆలయ అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. ఆషాడ మాసోత్సవాలు, వారాహి నవరాత్రులు, శాకంబరీ ఉత్సవాలతో పాటూ ప్రతి శుక్రవారం, శనివారం భక్తుల రద్దీ మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఏపీతో పాటుగా తెలంగాణ, ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివస్తారు. భక్తుల కోసం ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ముందుగా ఆలయంలోని గర్భగుడిలో ఉన్న దుర్గమ్మను దర్శించుకుంటారు.. అనంతరం మహా మండపంలో ఉన్న ఉత్సవ మూర్తికి సారె సమర్పిస్తారు. అలాగే తమతో పాటూ వచ్చిన మిగిలిన భక్తులకు కూడా పసుపు కుంకుమ ఇచ్చిపుచ్చుకోవడం ఆనవాయితీగా వస్తోంది.


ఈ ఆషాడమాసంలోనే ఇంద్రీకీలాద్రిపై శాకాంబరి ఉత్సవాన్ని కూడా ఘనంగా నిర్వహిస్తారు. ఈ మేరకు కూరగాయలు, పండ్లు, ఆకు కూరలతో అమ్మవారిని విశేషంగా అలంకరిస్తారు.. ఆలయాన్ని కూడా ముస్తాబు చేస్తారు. దేశమంతా పచ్చగా ఉండాలని, పాడి పంటలతో కళకళలాడాలని అమ్మను ప్రార్థిస్తూ శాకాంబరి ఉత్సవాలు ప్రతి ఏటా నిర్వహిస్తారు. శాకాంబరి అమ్మవారి గురించి దేవీభాగవంతో పాటూ మార్కండేయ పురాణంలోనూ ఉంది అని చెబుతున్నారు పండితులు. మొత్తం మీద ఇంద్రకీలాద్రి భక్తులతో కిటకిటలాడుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com