మహేంద్ర సింగ్ ధోనీ.. అభిమానులు ముద్దుగా పిలుచుకునే తలా.. ఆయన కనిపిస్తే విజిల్స్.. ఆయన బ్యాట్ పడితే అదుర్స్.. క్రికెట్ ప్రేమికుల గుండెల్లో గూడు కట్టుకున్న మహేంద్ర సింగ్ ధోనీ.. రేపు (జులై 7) పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఆదివారం 43వ ఏట అడుగుపెడుతున్నారు. ఈ నేపథ్యంలో మహేంద్ర సింగ్ ధోనీ పుట్టినరోజును ఘనంగా నిర్వహించేందుకు దేశవ్యాప్తంగా ఉన్న తలా అభిమానులు రెడీ అయ్యారు. అలాగే ఆంధ్రప్రదేశ్లోని ధోనీ అభిమానులు కూడా సిద్ధమవుతున్నారు. ధోనీ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా.. కృష్ణా జిల్లా నందిగామ మండలం అంబారుపేట వద్ద భారీ కటౌట్ ఏర్పాటు చేశారు. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి పక్కన ధోనీ వంద అడుగుల కటౌట్ను అభిమానులు ఏర్పాటు చేశారు. నేషనల్ హైవే పక్కనే కావడంతో ఈ భారీ కటౌట్.. చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
మరోవైపు ధోని పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఏటా ఇక్కడ ధోనీ కటౌట్ను ఏర్పాటు చేస్తున్నట్లు అభిమానులు చెప్పారు. గతేడాది కూడా 77 అడుగుల కటౌట్ ఏర్పాటు చేశారు. ఈ సారి 100 అడుగుల కటౌట్ను ఏర్పాటు చేయడం విశేషం. ధోనీ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా 100 అడుగుల కటౌట్తో పాటు 300 మందికి అన్నదానం చేయనున్నట్టు ఫ్యాన్స్ చెప్పారు. దీని కోసం ఒక లక్షా 80 వేల రూపాయలు ఖర్చు అయ్యినట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ కటౌట్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో టీమిండియా 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది. అలాగే ఐపీఎల్లోనూ చెన్నై సూపర్ కింగ్స్ను పలుసార్లు ఛాంపియన్గా నిలిపాడు ధోనీ. అయితే ఇటీవలే సుధీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ టీమిండియా ఐసీసీ టోర్నీ గెలిచింది. 17 ఏళ్ల తర్వాత టీ20 ఛాంపియన్గా నిలిచింది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ ప్రేమికులు ఈ విజయాన్ని ఆస్వాదించే సమయంలోనే మహేంద్ర సింగ్ ధోనీ పుట్టినరోజు రావటం విశేషం.
మరోవైపు అంతర్జాతీయ క్రికెట్లో 90 టెస్టులు ఆడిన మహేంద్ర సింగ్ ధోనీ 6 సెంచరీలు, 33 అర్థశతకాలు నమోదుచేశారు. ఇక పరిమిత ఓవర్ల క్రికెట్ విషయానికి వస్తే 350 వన్డే మ్యాచ్లు ఆడిన తలా.. 10 సెంచరీలు, 73 హాఫ్ సెంచరీలు కొట్టారు. ఇక టీమిండియా తరుఫున 98 టీ20లు ఆడిన ధోనీ.. రెండ హాఫ్ సెంచరీలు నమోదు చేశారు.