గిరిజన సంక్షేమ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పాఠశాల విద్యార్థులకు కాస్మొటిక్ వస్తువులను నేరుగా ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం కాస్మొటిక్ వస్తువులను నేరుగా ఇవ్వకుండా.. కాస్మొటిక్ ఛార్జీలను విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమచేస్తూ వచ్చింది. అయితే ఆ నగదు సకాలంలో విడుదల చేయలేదనే ఆరోపణలు వచ్చాయి. దీంతో కాస్మొటిక్ వస్తువులు అందక విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వమే పేస్టు, బ్రష్, షాంపూ వంటి కాస్మొటిక్ వస్తువులను నేరుగా వారికి ఇవ్వాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు గిరిజన సంక్షేమశాఖ అధికారులు తమ ప్రతిపాదనను సీఎం చంద్రబాబు నాయుడు వద్దకు పంపారు. సీఎం చంద్రబాబు ఆమోదిస్తే ఈ నిర్ణయం అమల్లోకి రానుంది.
మరోవైపు గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఏపీవ్యాప్తంగా 548 పాఠశాలలు నడుస్తున్నాయి. ఇందులో సుమారుగా 1.25 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరందరికీ ప్రతి నెలా కాస్మొటిక్ ఛార్జీల కోసం కోటిన్నర రూపాయలు ఖర్చు అవుతోందని అంచనా. అయితే గత వైసీపీ ప్రభుత్వం ఈ నిధులు విడుదల చేయకపోవటంతో సుమారుగా పదికోట్లు బకాయిలు పడినట్లు తెలుస్తోంది. దీంతో గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా.. కాస్మొటిక్ వస్తువులనే నేరుగా ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. ఆ ఛార్జీలతో వస్తువులను కొని విద్యార్థులకు అందివ్వాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నారు.
మరోవైపు 2014 -19 మధ్య కాలంలోనూ టీడీపీ ప్రభుత్వం కాస్మొటిక్ వస్తువులను నేరుగా విద్యార్థులకే అందించింది. కాస్మొటిక్ వస్తువులుగా బ్రష్, పేస్ట్, షాంపూ, సబ్బు, పౌడర్, తిలకం, కొబ్బరినూనె అందిస్తూ వచ్చారు. ఇందుకోసం జిల్లాల వారీగా టెండర్లు పిలిచి.. టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్ల ద్వారా ఈ వస్తువులను విద్యార్థులకు పంపిణీ చేస్తూ వచ్చారు. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ విధానాన్ని మార్చింది. కాస్మొటిక్ ఛార్జీలను విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి వేస్తూ వచ్చింది. అయితే టీడీపీ ప్రభుత్వం గతంలో అనుసరించిన విధానాన్నే తిరిగి అమలు చేయాలని భావిస్తోంది.