ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అవినీతి కేసులో రైల్వే డీఆర్ఎంను అరెస్ట్ చేసిన సీబీఐ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 06, 2024, 07:53 PM

గుంతకల్ రైల్వే డీఆర్ఎం వినీత్‌సింగ్‌ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. అవినీతి ఆరోపణలపై వినీత్ సింగ్‌ను సీబీఐ అధికారులకు అదుపులోకి తీసుకున్నారు. గతిశక్తి స్కీమ్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం రైల్వే లైన్లను అభివృద్ధి చేస్తోంది. ఆందులో భాగంగానే గుంతకల్లు డివిజన్ పరిధిలోనూ రూ.500 కోట్లతో రైల్వే వంతెనల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అయితే ఈ నిర్మాణ పనులు చేస్తున్న కాంట్రాక్టర్ల నుంచి గుంతకల్లు రైల్వే అధికారులు లంచం డిమాండ్ చేశారు. ఇప్పటికే కాంట్రాక్టర్లతో భారీగా ఖర్చు పెట్టించినట్లు తెలిసింది. ఇక అధికారుల డిమాండ్లు పెరగడంతో పీలేరుకు చెందిన రమేష్ రెడ్డి అనే కాంట్రాక్టర్ సీబీఐకు సమాచారం అందించారు.


కాంట్రాక్టర్ రమేష్ రెడ్డితో పాటుగ జమ్మలమడుగుకు చెందిన మరో కాంట్రాక్టర్.. రైల్వే అధికారులు లంచం అడుగుతున్న విషయాన్ని సీబీఐకి ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు.. రైల్వే అధికారులు లంచం తీసుకుంటున్న సమయంలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. అలాగే మూడురోజుల పాటు సీబీఐ బృందం గుంతకల్లు రైల్వే డీఆర్ఎం కార్యాలయంలో సోదాలు నిర్వహించింది. తనిఖీల తర్వాత గుంతకల్లు రైల్వే డీఆర్ఎం వినీత్ సింగ్, డీఎఫ్ఎం ప్రదీప్ బాబుతో పాటుగా సీనియర్ డివిజనల్ ఇంజినీర్, రైల్వే ఎస్ఈ, అకౌంట్ అసిస్టెంట్‌లను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అరెస్ట్ విషయమై వారి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.


కుటుంబసభ్యులకు అరెస్ట్ వివరాలను వెల్లడించిన సీబీఐ అధికారులు.. నిందితులను ప్రత్యేక వాహనాల్లో వైద్యపరీక్షల కోసం గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు పూర్తైన తర్వాత.. కర్నూలులోని సీబీఐ కోర్టులో హాజరుపరచనున్నారు. అనంతరం సికింద్రాబాద్ తరలించే అవకాశాలు ఉన్నాయి. అయితే అవినీతి కేసులో రైల్వే డీఆర్ఎం పట్టుబడటం, సీబీఐ అధికారుల సోదాలు స్థానికంగా కలకలం రేపాయి. అయితే కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గతిశక్తి స్కీమ్ పనుల్లో ఇలాంటి అవకతవకలు జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. రైల్వే పనుల్లో అవినీతికి పాల్పడిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు, రైల్వే ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com