ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపు అనకాపల్లిలో జగన్నాథస్వామి రథయాత్ర

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 06, 2024, 05:51 PM

అనకాపల్లిలో ఆదివారం సుభద్ర, బలభద్ర సమేత జగన్నాథస్వామి రథయాత్రకు ఉత్సవ కమిటీ ఏర్పాట్లు పూర్తిచేసింది. స్థానిక గవరపాలెం అగ్గిమర్రిచెట్టు వద్ద కొలువైన జగన్నాథస్వామి ఆలయంలో ఉదయం పది గంటలకు రథయాత్ర ప్రారంభం కానుంది. జగన్నాథ రథయాత్ర వేడుకలు ఈనెల ఆరో తేదీ నుంచి 16వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్టు ఉత్సవ కమిటీ చైర్మన్‌ దాడి బుజ్జి, ఈవో రాజసులోచన తెలిపారు. ఆరో తేదీ రాత్రి ఆలయంలో ప్రధాన అర్చకులు బంకుపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో రుక్ష్మిణి, సత్యభామ సమేత వేణుగోపాలస్వామి కల్యాణం నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్టు వారు చెప్పారు. ఆదివారం ఉదయం సుభద్ర బలభద్ర సమేత జగన్నాథస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఉత్సవమూర్తులను రథంపై ఏర్పాటు చేయనున్నారు. ఉదయం పది గంటలకు రథయాత్ర ప్రారంభం కానుంది. ఈ రథయాత్ర గవరపాలెం పురవీధుల గుండా చిననాలుగురోడ్ల జంక్షన్‌, స్టేషన్‌రోడ్డు, చిననాలుగురోడ్ల జంక్షన్‌, పెరుగుబజార్‌, గాంధీబొమ్మ జంక్షన్‌, మళ్లవీధి మీదుగా గూడ్స్‌షెడ్డు వద్ద గల ఇంద్రజ్యుమ్న హాల్‌ వరకు సాగుతుంది. అక్కడ ఉత్సవమూర్తులను ఏర్పాటు చేసి నవరాత్రులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. రోజుకొక అవతారంలో స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. ఈనెల 16వ తేదీ తిరుగు రథయాత్ర జరగనుంది. రథయాత్ర సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com