కేంద్రం, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంతో ప్రజలు ఎంచుకున్న ప్రజా పరిపాలన మొదలైందని పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు. విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి ఊరేగింపుగా ఈరోజు(శనివారం) రోడ్డు మార్గాన విజయనగరం వెళ్లగా టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈసందర్భంగా అప్పలనాయుడు మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులను కలిసి ఎంతో బిజీగా గడిపారని అన్నారు. ఐదు కోట్ల ప్రజలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్రానికి కావలసిన అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని కేంద్రాన్ని కోరారని చెప్పారు. తనను రెండు లక్షల 50 వేల మెజార్టీతో ఎంపీగా గెలిపించిన ప్రజలకు ఎంతో రుణపడి ఉంటానని అన్నారు. ఉత్తరాంధ్ర నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలు, ఎంపీలంతా కలిసి ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తామని వివరించారు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నరేంద్ర మోదీ సూచనల మేరకు రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తామని అప్పలనాయుడు తెలిపారు.