ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ సన్నిధిలో ఆషాడ మాసోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈరోజు నుంచి ఆగస్టు 4 వరకు ఈ మాసోత్సవాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారికి వైదిక కమిటీ సభ్యులు తొలిసారెను సమర్పించారు. మేళ తాళాలతో మంగళ వాయిద్యాలతో అమ్మవారికి కమిటీ సభ్యులు సారెను సమర్పించారు. అమ్మవారికి పసుపు, కుంకుమ, చీర, జాకెట్, చలిమిడి, గోరింటాకును భక్తులు సమర్పించారు. ఆషాడ మాసం తొలిరోజు కావడంతో ఇంద్రకీలాద్రి భక్తులతో కిక్కిరిసింది. ఆషాడ మసోత్సవాల సందర్భంగా నెలరోజుల పాటు ఇంద్రకీలాద్రి భక్తులతో కిటకిటలాడనుంది. అలాగే అమ్మవారికి శివ స్వామి సారెను సమర్పించారు. 116 మంది భక్తులతో కలిసి వచ్చి అమ్మవారికి సారెను సమర్పించారు. ఆషాడ మాసం నెలరోజుల పాటు అమ్మవారికి భక్తులు సారెను సమర్పించనున్నారు. ఆషాడ మాసోత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. దుర్గమ్మను సారెను సమర్పించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు.