టీడీపీకి పదవులు ఎప్పుడూ ముఖ్యం కాదని, వాజపేయి హయాంలో కూడా ఏడు మంత్రిపదవులు ఇస్తామన్నా వద్దన్నామని చంద్రబాబు తెలిపారు. ఎన్డీయేతో సత్సంబంధాల కోసమే బలవంతం మీద నాడు లోక్సభ స్పీకర్ పదవి తీసుకున్నామని చెప్పారు. అయితే అప్పటికీ, ఇప్పటికీ పరిస్థితులు మారాయన్నారు. కేంద్రంలో తమకు కేటాయించిన మంత్రి పదవుల పట్ల సంతోషంగా ఉన్నామని తెలిపారు. లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవిని కూడా కోరుకోవడం లేదని చెప్పారు. కావాలంటే నా తరఫున మీరు అడగండని చమత్కరించారు. బీజేపీ ఎజెండాకు తాము మద్దతిచ్చామని.. తమ ఎజెండాకు వారు మద్దతిచ్చారని.. రెండు పార్టీలు పరస్పర ఎజెండాలకు అనుగుణంగా పనిచేస్తాయని తెలిపారు. 2014లో మోదీతో ఉన్న సంబంధాలకు, ఇప్పటి సంబంధాలకూ తేడా ఏమిటని ప్రశ్నించగా.. ఆయన నేరుగా జవాబివ్వలేదు. ‘నేను ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు మీరెలా చూశారు.. ఇప్పుడెలా ట్రీట్ చేస్తున్నారు? పరిస్థితులు మారాయి కదా..! ఇప్పుడు మేం కలిసి పని చేస్తాం’ అని తెలిపారు. ఏపీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించామని మోదీ కూడా చెప్పారని గుర్తుచేశారు.