ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చంద్రబాబుపై లోక్ సభలో సెటైర్లు.. ఫస్ట్ ప్రసంగంలోనే దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన ఎంపీ బైరెడ్డి శబరి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 02, 2024, 07:38 PM

ఢిల్లీలో లోక్ సభ సమావేశాలు వాడీవేడీగా జరుగుతున్నాయి. విపక్ష నేత రాహుల్ గాంధీ ప్రసంగం గురించే ప్రధానంగా చర్చ నడుస్తున్నా.. తెలుగు ఎంపీలు సైతం తమ రాష్ట్రాల సమస్యలపై గొంతెత్తుతున్నారు. ఏపీకి చెందిన లోక్ సభ సభ్యులు కూడా రాష్ట్రానికి రావాల్సిన హక్కులపై గొంతు వినిపిస్తున్నారు. పార్టీల సంగతి పక్కనపెడితే.. అందరూ ఎంపీలు ఆంధ్రప్రదేశ్ హక్కుల మీద, కేంద్రం సహకారం మీద చర్చిస్తున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ ఎంపీ, నంద్యాల లోక్ సభ సభ్యురాలు బైరెడ్డి శబరి మాట్లాడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎంపీగా గెలవడం శబరికి ఇదే తొలిసారి కాగా.. ఆమె ఫస్ట్ స్పీచ్ అందరినీ ఆకట్టుకుంది. ఈ వీడియోను టీడీపీ శ్రేణులు వైరల్ చేస్తున్నాయి.


అయితే శబరి మాట్లాడకముందు లోక్ సభలో మాట్లాడిన టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ.. ప్రస్తుతం మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు, నితీశ్ కుమార్ అనే రెండు ఊతకర్రల సాయంతో నడుస్తోందంటూ సెటైర్లు వేశారు. అలాగే ఈడీ అరెస్ట్ చేసిన చంద్రబాబు మద్దతు తీసుకున్నారని విమర్శించారు. ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదంటూ వ్యాఖ్యానించారు. అయితే టీఎంసీ ఎంపీ వ్యాఖ్యలకు నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి గట్టి కౌంటర్ ఇచ్చారు. గుర్తుపెట్టుకోండి చంద్రబాబు అంటే కర్ర కాదు కత్తి అంటూ మాట్లాడిన బైరెడ్డి శబరి..చంద్రబాబును ఈడీ అరెస్ట్ చేయలేదనే విషయాన్ని గుర్తుచేశారు. చంద్రబాబును ఏపీ సీఐడీ అరెస్ట్ చేసిందనే విషయాన్ని క్లారిటీ ఇచ్చారు. నంద్యాలలో సీఐడీ అధికారులు చంద్రబాబును అరెస్ట్ చేశారన్న శబరి.. అందుకే నంద్యాల జిల్లా మొత్తం టీడీపీ హవా నడిచిందని చెప్పారు.


అలాగే బైరెడ్డి శబరి తన తొలి స్పీచ్‌లో వైసీపీ విధానాలను ఎండగట్టారు. వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్‌కు ఒక్క ఐటీ కంపెనీ కూడా రాలేదని విమర్శించారు. హైదరాబాద్ అభివృద్ధిలో చంద్రబాబు పాత్ర ఉందన్న ఎంపీ.. టీడీపీ పాలనలో ఏపీ కూడా అభివృద్ధి చెందిందన్నారు. అయితే వైసీపీ ఐదేళ్ల పాలనలో ఏపీ నాశనమైపోయిందని ఆరోపించారు. దేశంలో రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఏపీనే అంటూ విమర్శలు చేశారు. వైసీపీ ఐదేళ్ల పాలన కారణంగా ఏపీ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని ఆరోపించారు. ఏపీ రాజధాని అమరావతికి అప్పట్లో ప్రధాని మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగిన విషయాన్ని శబరి ప్రస్తావించారు.


అయితే 2019 ఎన్నికల తర్వాత ఏపీలో అధికారంలోకి వచ్చిన వైసీపీ మూడు రాజధానులు అంటూ కాలయాపన చేసిందని బైరెడ్డి శబరి మండిపడ్డారు. టీడీపీ హయాంలో పోలవరం ప్రాజెక్టును 72 శాతం పూర్తి చేస్తే.. వైసీపీ పాలనలో ఒక్క శాతం పనులు కూడా చేయలేదని ఆరోపించారు. వైసీపీ పాలనలో ఏపీలో మద్యం, ఇసుక, ల్యాండ్ మాఫియాలు నడిచాయంటూ ఆరోపించారు. అయితే శబరి ప్రసంగం జరుగుతున్న సమయంలో ప్యానెల్ స్పీకర్ సమయం ముగిసిందని చెప్పారు. అయితే ఎంపీగా ఇదే నా తొలి ప్రసంగం అంటూ రిక్వెస్ట్ చేసిన నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి.. ఇచ్చిన సమయంలోనే వైసీపీ విధానాలపై విరుచుకుపడ్డారు. అలాగే రాష్ట్రాభివృద్ధికి కేంద్రం సహకరించాలని కోరారు.


మరోవైపు ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నంద్యాల లోక్ సభ నియోజకవర్గం నుంచి టీడీపీ తరుపున పోటీ చేసిన బైరెడ్డి శబరి.. వైసీపీ అభ్యర్థి బ్రహ్మానందరెడ్డి మీద విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి మీద లక్షా పదివేల ఓట్ల పైచిలుకు తేడాతో గెలుపొందారు. ప్రత్యేక రాయలసీమ ఉద్యమ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి వారసురాలిగా రాజకీయాల్లోకి వచ్చారు శబరి. ఎన్నికల ముందు వరకూ బీజేపీలో కొనసాగిన ఆమె.. ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి నంద్యాల నుంచి పోటీచేసి విజయం సాధించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com