ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇక మరింత రుచిగా తిరుపతి లడ్డూ.. టీటీడీ ఈవో కీలక నిర్ణయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jun 30, 2024, 08:07 PM

తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో సంచలన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గత వైసీపీ పాలనలో రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలు ధ్వంసం అయ్యాయని పేర్కొంటున్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం.. వాటన్నింటినీ చక్కదిద్దుతామని ఇప్పటికే ఎన్నోసార్లు తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలోనే తిరుమల తిరుపతి దేవస్థానంపై నారా చంద్రబాబు నాయుడు సర్కార్ మరింత దృష్టిసారించింది. తిరుమల దర్శనానికి వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించడంతోపాటు.. తిరుమలలో లడ్డూ, ఉచిత అన్న ప్రసాదాల నాణ్యతలో ఎలాంటి రాజీ పడకూడదని నిర్ణయించింది. భక్తులకు మంచి రుచితో కూడిన ప్రసాదాలు అందించాలని కీలక చర్యలు చేపడుతోంది.


తాజాగా తిరుపతిలోని తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలన భవనంలో అధికారులు, డైరీ నిపుణులతో టీటీడీ ఈవో జే శ్యామలరావు సమీక్షా సమావేశం నిర్వహించారు. శ్రీవారి లడ్డు నాణ్యతను మరింత పెంచడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. లడ్డూ తయారీలో వినియోగించే నెయ్యి విషయంపై ప్రధానంగా ఫోకస్ చేశారు. నాణ్యమైన నెయ్యిని ఎలా కొనుగోలు చేయాలి.. కొనుగోలు చేసిన నెయ్యిని ప్రస్తుతం పరీక్షిస్తున్న విధంగా కాకుండా మరింత అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎలా పరీక్షించాలి వంటి అనేక అంశాలపై చర్చించారు. ఈ క్రమంలోనే అందుకు తీసుకోవాల్సిన చర్యలను తెలపాలని అధికారులకు సూచించారు.


లడ్డు నాణ్యత పెంచేందుకు ఎస్ఎస్ఐ నిబంధనల ప్రకారం నాణ్యమైన నెయ్యిని ఎలా తయారు చేస్తున్నారు.. ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా అగ్ మార్క్, టీటీడీ నిబంధనల ప్రకారం నెయ్యి నాణ్యత ఎలా ఉండాలనే విషయమై.. టీటీడీ ఈవో జే శ్యామలరావుకు.. టీటీడీ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. లడ్డూ నాణ్యత మరింత పెంచడానికి అవసరమైన నెయ్యిని సమకూర్చుకోవడానికి త్వరలోనే సమగ్ర నివేదిక అందించాలని అధికారులను ఈవో ఆదేశించారు.


ఇక ఇదివరకే టీటీడీ ఈవో జే శ్యామలరావు.. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై టీటీడీ అధికారులు, పోటు కార్మికులతో సమీక్ష చేశారు. నాణ్యమైన నెయ్యి, శనగపిండి, యాలకులు ఉపయోగించి మరింత రుచికరంగా తిరుమల లడ్డూలను తయారు చేసి.. మొదట నాణ్యతను పరిశీలించాలని సూచించారు. లడ్డూ తయారీలో సమస్యలు, నాణ్యతా ప్రమాణాలపై వస్తున్న విమర్శలను పోటు కార్మికులను అడిగి తెలుసుకున్నారు. లడ్డూకు కావాల్సిన అన్ని ముడి సరుకులను టెండర్ల ద్వారా సేకరిస్తున్నామని.. తక్కువ ధరకు తెలిపిన వారి దగ్గర నుంచి కొనుగోలు చేస్తామని సంబంధిత అధికారులు ఈవోకు వివరించారు. ఈ క్రమంలోనే మరోసారి సమీక్ష నిర్వహించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com