ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పోలవరం పూర్తికి చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం.. రంగంలోకి అంతర్జాతీయ నిపుణుల బృందం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jun 30, 2024, 08:02 PM

పోలవరం ప్రాజెక్టును సందర్శించేందుకు వివిధ దేశాలకు చెందిన అంతర్జాతీయ జలవనరుల బృందం ఆంధ్రప్రదేశ్‌కు చేరుకుంది. పోలవరం ప్రాజెక్టులో కీలక సాంకేతిక సవాళ్లను పరిష్కరించే లక్ష్యంతో వారు రంగంలోకి దిగారు. అమెరికా, కెనడాకు చెందిన నలుగురు ఎక్స్‌పర్ట్స్‌ శనివారం ఢిల్లీకి చేరుకోగా.. నేటి నుంచి పోలవరంలో 4 రోజుల పాటు వారు పర్యటించనున్నారు. 2 రోజుల పాటు పోలవరం ప్రాజెక్టును పూర్తిగా పరిశీలించనున్నారు. ఆ తర్వాత ప్రతీ నిర్మాణాన్ని క్షుణ్ణంగా పరిశీలించేలా షెడ్యూల్‌ రూపొందించారు.


అనంతరం రెండురోజుల పాటు మేధోమథనం చేయనున్నారు. ఇంటర్నేషనల్ ఎక్స్‌పర్ట్స్‌తోపాటు పోలవరం ప్రాజెక్టు అథారిటీ ముఖ్యులు, కేంద్ర జలసంఘం నిపుణులు, సీఎస్‌ఎంఆర్‌ఎస్‌ ప్రతినిధులు, వ్యాప్కోస్, బావర్, కెల్లర్, మేఘా కంపెనీల ప్రతినిధులు, అంతర్జాతీయ డిజైన్‌ సంస్థ అఫ్రి ప్రతినిధులు.. పోలవరం సందర్శించనున్నారు. ఆ తర్వాత నైపుణ్య ఏజెన్సీలు, వివిధ ప్రొఫెసర్లు, నిపుణులతో అంతర్జాతీయ నిపుణులు చర్చించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.


పోలవరం ప్రాజెక్టు ముందుకు సాగకపోవడానికి ఏర్పడిన సమస్యలను పరిష్కరించడానికి అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలు అవసరమని గుర్తించిన కేంద్ర జలసంఘం.. ఇప్పటికే డిజైన్లు రూపొందించేందుకు అంతర్జాతీయ డిజైన్‌ ఏజెన్సీ అఫ్రిని ఆశ్రయించింది. వీరికి తోడు అమెరికాకు చెందిన డేవిడ్‌ బి పాల్, గియాస్‌ ఫ్రాంకో డి సిస్కో, కెనడాకు చెందిన రిచర్డ్‌ డోన్నెల్లీ, సీస్‌ హించ్‌బెర్గర్‌లను నియమించారు. అంతర్జాతీయ డ్యాం భద్రత నైపుణ్యం, సివిల్‌ ఇంజినీరింగ్, హైడ్రాలిక్‌ నిర్మాణాలు, స్ట్రక్చరల్‌ ఇంజినీరింగ్, స్ట్రక్చరల్‌ సొల్యూషన్స్, జియో టెక్నికల్‌ ఇంజినీరింగ్‌ వంటి అంశాల్లో ఈ నిపుణులకు ఉన్న అంతర్జాతీయ స్థాయి నైపుణ్యం ఉపయోగపడుతుందని కేంద్ర జలసంఘం తెలిపింది.


పోలవరం ప్రాజెక్టులోని ఎగువ కాఫర్‌ డ్యాం నుంచి వీరి పర్యటన మొదలుకానుంది. ఈ క్రమంలోనే కీలక నిర్మాణాలకు సంబంధించి.. ప్రాజెక్టు ప్రారంభం నుంచి ఉన్న ఫోటోలు, అధ్యయనాలు.. ఆ టీమ్ పరిశీలించనుంది. 2018లో ఈ ఎగువ కాఫర్ డ్యాం భద్రతకు సంబంధించి నివేదిక, డ్యాం సీపేజీపై ప్రొఫెసర్‌ రాజు 2021లో ఇచ్చిన రిపోర్టులు.. 2022, 2023 లలో ఫీజోమీటర్ల సాయంతో సీపేజీపై జరిపిన విశ్లేషణలు, 2024 జనవరిలో సీఎస్‌ఎంఆర్‌ఎస్‌ సమర్పించిన నివేదిక.. కొత్తగా వచ్చిన అఫ్రి సంస్థ జియో టెక్నికల్‌ పరిశోధనల వివరాలను.. అధికారులు ఆ బృందానికి అందించనున్నారు. ఆ తర్వాత దిగువ కాఫర్‌ డ్యాంను పరిశీలించేలా ప్లాన్ చేశారు.


ఇక ప్రధాన డ్యాం నిర్మాణాలు, ధ్వంసం అయిన డయాఫ్రం వాల్‌ పరిశీలన, అక్కడ ఏర్పడిన భారీగ గుంతలు, డ్యాం వద్ద భూభౌతిక పరిస్థితుల మార్పునకు చేస్తున్న ప్రయత్నాలపై ఎక్కువ దృష్టి సారించనున్నారు. ప్రస్తుతం పోలవరంలో ప్రధాన సవాళ్లన్నీ ఈ ప్రాంతాల్లో ఉండటంతో అక్కడే నిపుణుల బృందం ఎక్కువ సమయం పరిశీలించనుంది. ఆ తర్వాత రెండ్రోజుల్లో నిపుణులు, అధికారులతో వారు చర్చించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com