ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బెంగాల్ రైలు ప్రమాదం.. వందేభారత్‌తో పాటు ఆ రైలు వేగంపై రైల్వే కీలక నిర్ణయం

national |  Suryaa Desk  | Published : Fri, Jun 28, 2024, 11:16 PM

ఇటీవల చోటుచేసుకుంటోన్న వరుస రైలు ప్రమాదాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. గతవారం పశ్చిమ్ బెంగాల్‌లో కంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్‌ను గూడ్సు రైలు ఢీకొట్టిన ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోగా.. పదుల సంఖ్యలో గాయపడ్డారు. అయితే, ప్రమాదాల నుంచి రక్షణ కల్పించే ఆటోమేటిక్‌ ట్రెయిన్ ప్రొటెక్షన్ వ్యవస్థ (ఏటీపీ) అందుబాటులో లేకపోవడంతోనే తరుచూ ఇటువంటి ఘటనలు జరుగుతున్నట్టు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు, రైల్వే అధికారుల నిర్లక్ష్యం కూడా ప్రమాదాలకు కారణమనే ఆరోపణలు ఉన్నాయి.


ఈ నేపథ్యంలో వందేభారత్, గతిమాన్‌ ఎక్స్‌ప్రెస్‌ల వేగంపై రేల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఏటీపీ వ్యవస్థ అందుబాటులోకి వచ్చే వరకూ ఈ రెండు రైళ్ల గరిష్ఠ వేగాన్ని 130 కి.మీ.కు తగ్గించాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఢిల్లీ హజ్రత్ నిజాముద్దీన్‌- ఝాన్సీ మధ్య గతిమాన్‌ ఎక్స్‌ప్రెస్, రెండు వందేభారత్‌ రైళ్లు గంటకు 160 కి.మీ. వేగంతో నడుస్తున్నాయి (మిగిలిన చోట్ల వందేభారత్ వేగం 130 కి.మీ. లోపే). రక్షణ వ్యవస్థను ప్రారంభించేవరకూ వీటి వేగం కూడా 130 కి.మీ.కి మించకుడా నడపాలని రైల్వేబోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (సిగ్నల్‌) ఉత్తర మధ్య రైల్వే జోన్‌ జనరల్‌ మేనేజర్‌కు లేఖ రాశారు. రైల్వే బోర్డులోని ఇన్‌ఫ్రా, ట్రాకేషన్, రోలింగ్ స్టాక్, ఆపరేషన్ అండ్ బిజినెస్ డెవలప్‌మెంట్ సభ్యులు దీనికి ఆమోదం తెలిపినట్టు పేర్కొన్నారు.


ఇక, దేశంలోనే మొట్టమొదటి సెమీ-హైస్పీడ్ రైలుగా గుర్తింపు పొందిన గతిమాన్ ఎక్స్‌ప్రెస్‌ను ఏప్రిల్ 2016లో ఢిల్లీ-ఝాన్సీల మధ్య ప్రారంభించారు. నిజాముద్దీన్-ఆగ్రా మధ్య మాత్రమే ట్రాక్ అనుకూలంగా ఉండటంతో ఈ రైలు గంటకు 160 కి.మీ. వేగంతో నడుస్తుంది. ఆగ్రా నుంచి ఝాన్సీ వరకూ 130 కి.మీ.లోపు వేగంతో ప్రయాణిస్తుంది. తాజాగా, మొత్తం రైలు వేగం 130 కి.మీ.లకు మించకూడదని ఆదేశించారు.


‘నిజాముద్దీన్, ఆగ్రా మధ్య దూరం 188 కి.మీలు.. అందులో దాదాపు 125 కి.మీలు వరకు గరిష్టంగా 160 కి.మీ వేగంతో నడుపుతున్నారు... మిగిలిన చోట్ల దీని వేగం మారుతూ ఉంటుంది కానీ 130 కంటే తక్కువగా ఉంటుంది.. తదుపరి ఉత్తర్వులు వెలువడేవరకూ వందే భారత్, గతిమాన్ వేగాన్ని 130 కి.మీ. మించకుండా నడపాలి’ అని పేర్కొంది. ఆగ్రా డివిజన్ పరిధిలోని 80 కి.మీ. మేర ‘కవచ్’ వ్యవస్థ పనులు పూర్తికావచ్చాయి.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com