ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఢిల్లీలో నిన్నటివరకు భారీ ఎండలు.. ఇప్పుడు 88 ఏళ్ల రికార్డు వర్షపాతం

national |  Suryaa Desk  | Published : Fri, Jun 28, 2024, 11:15 PM

కొన్ని నెలలుగా తీవ్రమైన ఎండలు, వేడిగాలులతో అల్లాడిపోయిన ఢిల్లీ నగరం.. ప్రస్తుతం కుంభవృష్టి వానలకు అతలాకుతలం అవుతోంది. గురువారం కురిసిన భారీ వర్షానికి ఢిల్లీ నగరం మొత్తం వరద నీటిలో చిక్కుకుంది. ఎక్కడికక్కడ నీరు నిలిచిపోవడంతో లోతట్టు ప్రాంతాలు నీటిలో చిక్కుకున్నాయి. ఇక నగరంలో ఎక్కడ చూసిన భారీగా ట్రాఫిక్ నెలకొంది. ఈ నేపథ్యంలోనే 88 ఏళ్లనాటి రికార్డును బద్దలు కొడుతూ ఢిల్లీని భారీ వర్షం ముంచెత్తింది. ఇన్నేళ్ల నుంచి జూన్ నెలలో ఒక్కరోజులో ఇంతటి వర్షపాతం నమోదు కాలేదని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.


గురువారం ఉదయం 8.30 గంటల నుంచి శుక్రవారం ఉదయం 8.30 గంటల వరకు ఢిల్లీ ఎన్‌సీఆర్ పరిధిలో 24 గంటల వ్యవధిలో 235.5 మిల్లీమీటర్ల మేర వర్షం పడినట్లు భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇది 1936 నుంచి జూన్ నెలలో ఒకరోజులో నమోదైన అత్యధిక వర్షపాతం అని పేర్కొన్నారు. సాధారణంగా ఢిల్లీలో ప్రతీ ఏటా జూన్‌లో సగటున 80.6 మిల్లీమీటర్ల వర్షపాతం కురుస్తుండగా.. ఈసారి అది ఏకంగా 235.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో ఢిల్లీ వాసులు వరద ముంపులో చిక్కుకున్నారు.


ఈ కారణంగా ఢిల్లీలో తీవ్ర ట్రాఫిక్ ఏర్పడింది. వాహనదారులు గంటల తరబడి ట్రాఫిక్‌ జామ్‌లో చిక్కుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అంతేకాకుండా గత కొన్ని రోజులుగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయని వాతావరణ శాఖ పేర్కొంది. శుక్రవారం ఢిల్లీలో 24.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని.. ఇది సాధారణం కన్నా 3.2 డిగ్రీలు తక్కువ అని వెల్లడించింది.


ఒక్కరోజులోనే ఢిల్లీలో ఇంతటి భారీ వర్షం కురవడంతో వసతులు, సౌకర్యాల లేమి కనిపిస్తోంది. అయితే ఈసారి వర్షాకాలానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు ఢిల్లీ మేయర్ షెల్లీ ఒబెరాయ్ ఈ నెల 18 వ తేదీనే పేర్కొనగా.. తాజాగా మొదటి వర్షానికే నగరం మొత్తం అల్లకల్లోలం కావడంతో.. అధికారులు, ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఢిల్లీలో వరద నీటిని బయటికి పంపించేందుకు డ్రైనేజీ వ్యవస్థ శుభ్రంగా ఉందని మేయర్ పేర్కొన్నారు. కానీ కొన్ని ప్రాంతాల్లో 2, 3 అడుగుల మేర నీరు నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నాయి.


ఇక శుక్రవారం తెల్లవారుజామున 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకు కుంభవృష్టి కురిసింది. ఈ 3 గంటల వ్యవధిలోనే ఢిల్లీలో 150 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైనట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆజాద్‌ మార్కెట్‌ అండర్‌ పాస్‌ వద్ద పలు లారీలు నీట మునిగిపోయాయి. నోయిడా, ఘజియాబాద్‌ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలకు ప్రధాన రహదారులు మొత్తం జలమయమయ్యాయి.


మరోవైపు శుక్రవారం తెల్లవారుజామున ఢిల్లీ ఎయిర్‌పోర్టులోని టెర్మినల్‌ 1 పైకప్పు కొంత భాగం కూలిపోయి అక్కడే ఉన్న కార్లపై పడటం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో 8 మందికి గాయాలు అయ్యాయి. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇక టెర్మినల్ పైకప్పు కూలడంతో విమాన రాకపోకలపై ప్రభావం పడింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com