ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిండు గర్భిణీ ప్రాణం తీసిన ఫేక్ డాక్టర్లు.. తప్పుడు ఇంజెక్షన్ ఇవ్వడంతో దారుణం

national |  Suryaa Desk  | Published : Fri, Jun 28, 2024, 10:05 PM

ఒక్క తప్పుడు ఇంజెక్షన్.. గర్భిణీ, ఆమె కడుపులో 9 నెలల పాటు పెరిగిన పిండాన్ని.. భూమిపైకి రాకుండానే పైకి తీసుకెళ్లింది. నకిలీ డాక్టర్లు ఇచ్చిన ఆ తప్పుడు ఇంజెక్షన్.. ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. 9 నెలల గర్భిణీతోపాటు ఆమె కడుపులో ఉన్న శిశువు కాస్తా ప్రాణాలు కోల్పోయారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగిన ఈ సంఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. డెలివరీ కోసం తీసుకువచ్చిన ఆ గర్భిణీ.. శిశువుతో సహా చనిపోయింది. ఈ ఘటనపై బాధితురాలి కుటుంబ సభ్యులు ఆందోళన చేయగా.. మెడికల్ దర్యాప్తునకు ఆదేశించారు. ఈ దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ గర్భిణీకి ఒక ఇంజెక్షన్ ఇవ్వడానికి బదులు మరో ఇంజెక్షన్ ఇచ్చారని వెల్లడైంది. అంతేకాకుండా ఆమెకు ట్రీట్‌మెంట్ ఇచ్చిన డాక్టర్లు ఫేక్ అని తేలడం మరో సంచలనంగా మారింది.


భదోహి జిల్లాలోని విక్రమ్‌పూర్ గ్రామానికి చెందిన 23 ఏళ్ల అంచల్‌ నిండు గర్భిణీ. అంచల్‌కు నెలలు నిండడంతో.. డెలివరీ కోసం ఆమె కుటుంబ సభ్యులు స్థానిక ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ఆ తర్వాత సిజేరియన్ ఆపరేషన్ చేయాలని డాక్టర్లు సూచించారు. ముందుగా రూ.50 వేలు చెల్లించాలని సూచించడంతో కుటుంబ సభ్యులు చెల్లించారు. ఆపై ఆ ఆస్పత్రిలోని ఇద్దరు డాక్టర్లు వినయ్‌ కుమార్‌ పాండే, శివ్ బహదూర్ యాదవ్.. ప్రసవం కోసం అంచల్‌కు ఒక ఇంజెక్షన్ ఇచ్చారు. ఆ తర్వాత తీవ్ర అస్వస్థతకు గురైన అంచల్.. ప్రాణాలు కోల్పోయింది. ఆమెతోపాటే కడుపులో ఉన్న పిండం కూడా చనిపోయింది.


ఈ ఘటనపై తీవ్ర భయాందోళనకు గురైన డాక్టర్లు వినయ్‌ కుమార్‌ పాండే, శివ్ బహదూర్ యాదవ్.. ఆస్పత్రిలో ఆక్సిజన్ లేదంటూ.. అక్కడి నుంచి పారిపోయారు. అయితే డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే అంచల్ చనిపోయిందని.. ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. అంతేకాకుండా ఈ ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో భదోహి జిల్లా చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ సంతోష్‌ కుమార్‌.. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు. వెంటనే రంగంలోకి దిగిన మెడికల్ అధికారులు.. ఆ ప్రైవేట్‌ ఆస్పత్రికి ఎలాంటి లైసెన్స్ లేదని తేల్చారు. అంతేకాకుండా ఆ ఇద్దరు డాక్టర్లు.. వినయ్‌ కుమార్‌ పాండే, శివ్ బహదూర్ యాదవ్ మెడికల్ డిగ్రీలు కూడా నకిలీవి అని గుర్తించారు.


ఇక అంచల్ మృతదేహానికి నిర్వహించిన పోస్ట్ మార్టం రిపోర్ట్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె, ఆమె కడుపులో పెరుగుతున్న శిశువు మరణించడానికి కారణం ఇంజెక్షన్ అని తేల్చారు. అంచల్‌కు ఒక ఇంజెక్షన్ ఇవ్వాల్సి ఉండగా.. వాళ్లు ఫేక్ డాక్టర్లు కాబట్టి వేరే ఇంజెక్షన్ ఇచ్చారని.. ఈ కారణంగానే నిండు గర్భిణీ, ఆమె కడుపులోని పిండం మరణించినట్లు ఆ పోస్ట్‌ మార్టం రిపోర్ట్‌లో నిర్ధారణ అయ్యింది. దీంతో ఆ ఇద్దరు నకిలీ డాక్టర్లపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పరారీలో వారి కోసం గాలింపు చేపట్టారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com