ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారీ వర్షానికి ఇంట్లో చిక్కుకున్న ఎంపీ.. ఎత్తుకొచ్చి కార్లో కూర్చోబెట్టిన సిబ్బంది

national |  Suryaa Desk  | Published : Fri, Jun 28, 2024, 10:02 PM

గత కొన్ని నెలలుగా తీవ్ర ఎండ, హీట్‌వేవ్‌తో అల్లాడిపోయిన ఢిల్లీకి ప్రస్తుతం భారీ వర్షాలతో మరో పెద్ద సమస్య వచ్చిపడింది. రికార్డు స్థాయి వర్షపాతం నమోదు కావడంతో ఢిల్లీ నగరం మొత్తం వరదనీటిలో చిక్కుకుపోయింది. పలు ప్రాంతాల్లో మొత్తం నీరు నిలిచిపోయింది. ప్రస్తుతం పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరుగుతుండటంతో కొత్తగా ఎన్నికైన ఎంపీలతోపాటు కేంద్రమంత్రులు మొత్తం ఢిల్లీలోనే మకాం వేశారు. ఈ క్రమంలోనే ఎంపీలు, కేంద్రమంత్రుల నివాసాలు కూడా వరద ముంపులో చిక్కుకుపోయాయి. ఈ నేపథ్యంలోనే సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ నివాసంలోకి భారీగా వరదనీరు చేరడంతో ఆయన ఇంట్లోనే చిక్కుకున్నారు. అది గమనించిన సిబ్బంది రామ్ గోపాల్ యాదవ్‌ను ఎత్తుకుని వచ్చి.. కారులో కూర్చోబెట్టారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


ఢిల్లీలోని లోథి ఎస్టేట్ ప్రాంతంలో సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ రామ్‌ గోపాల్ యాదవ్‌ నివాసం ఉంది. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి కురిసిన కుంభవృష్టికి రామ్‌ గోపాల్ యాదవ్‌ నివాసం వరదలో మునిగిపోయింది. ఉదయం లేచేసరికి ఇంట్లోకి మొత్తం నీరు చేరిందని రామ్‌ గోపాల్ యాదవ్‌ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవలె తన ఇంట్లో మరమ్మత్తులు చేయించానని.. రెండు రోజుల క్రితం ఫ్లోరింగ్ చేయించగా.. ప్రస్తుతం పడిన వర్షానికి ఆ ఫ్లోరింగ్ మొత్తం కొట్టుకుపోయిందని తెలిపారు. దానికోసం పెట్టిన డబ్బు అంతా వేస్ట్ అయిపోయిందని వాపోయారు. తన ఇంట్లోకి చేరిన నీటిని బయటికి పంపించేందుకు తెల్లవారుజామున 4 గంటల నుంచి ఉదయం వరకు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందికి ఫోన్ చేసినా వారు స్పందించలేదని పేర్కొన్నారు.


ఎంపీని ఎత్తుకొచ్చి కార్లో కూర్చోబెట్టారు


ఈ క్రమంలోనే శుక్రవారం పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యేందుకు తీవ్ర ఇబ్బందికర పరిస్థితి ఎదురైందని రామ్ గోపాల్ యాదవ్ తెలిపారు. దీంతో రామ్ గోపాల్ యాదవ్ సిబ్బంది ఎంపీని ఎత్తుకొని వచ్చి ఇంటి బయట కారులో కూర్చోపెట్టారు. పార్లమెంట్‌కు వెళ్లేందుకే ఇదంతా అని ఆయన వెల్లడించారు. ఢిల్లీలో పరిస్థితి దారుణంగా ఉందని రామ్ గోపాల్ యాదవ్ పేర్కొన్నారు.


ఇక భారీ వర్షాలతో దేశ రాజధాని ఢిల్లీలో జనజీవనం తీవ్ర అస్తవ్యస్తంగా మారింది. మరోవైపు.. ఢిల్లీలో నీటి కొరతను పరిష్కరించాలంటూ నిరాహార దీక్షకు దిగిన ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు, ఢిల్లీ జలమంత్రి అతిషి మార్లేనా ఇల్లు కూడా వరదనీటిలో చిక్కుకుపోయింది. ఇక తన ఇంట్లో ఉన్న సామాన్లన్నీ వరదనీటికి పాడైపోయాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశిథరూర్‌ ట్విటర్‌లో వెల్లడించారు. శుక్రవారం ఉదయం తాను నిద్రలేచేసరికి అన్ని రూమ్‌లలో నీరు నిలిచిందని చెప్పారు. డ్రైనేజీలు నిండిపోవడంతో వర్షం నీరు బయటకు వెళ్లకుండా నిలిచిపోయిందని పేర్కొన్నారు. భారీ వర్షాలకు విద్యుత్ నిలిపివేయడంతో కరెంట్‌ కూడా లేదని శశిథరూర్‌ వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com