వైసీపీలో మరో వికెట్ పడింది. కమెడియన్ అలీ వైసీపీకి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఓ వీడియో ద్వారా తెలియజేశారు. ఇకపై తాను రాజకీయాలకు దూరమని ప్రకటించిన అలీ.. నటుడిగానే కొనసాగుతానని స్పష్టం చేశారు. ఏ పార్టీకి మద్దతు పలకబోనని స్పష్టం చేశారు. రామానాయుడు ప్రోత్సాహంతోనే తాను నటుణ్ని అయ్యానన్న అలీ.. ఆయన కోరిక మేరకే 1999లో రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. తెలుగుదేశం పార్టీ తరుఫున బాపట్ల లోక్ సభ నుంచి అప్పట్లో రామానాయుడు పోటీ చేశారని.. ప్రచారం చేయాలని తనను అడిగినట్లు చెప్పారు. ఆయన కోసమే టీడీపీలో చేరి 20 ఏళ్లు కొనసాగినట్లు చెప్పుకొచ్చారు.
మరోవైపు తనకు అన్నం పెట్టింది తెలుగు సినిమా ఇండస్ట్రీనేనన్న అలీ.. తన దయాగుణానికి రాజకీయం తోడైతే మంచి చేయవచ్చనే ఆలోచనతోనే రాజకీయాల వైపు వచ్చినట్లు చెప్పారు. అంతేకానీ నిజంగా రాజకీయాలు చేద్దామని రాలేదని వీడియోలో చెప్పుకొచ్చారు. తన నాన్నపేరు మీద ట్రస్టును నడుపుతున్నానని.. ఎంతోమందిని చదవిస్తున్నానని వీడియోలో చెప్పుకొచ్చారు. తాను రాజకీయాల్లో కూడా ఎవరినీ వ్యక్తిగతంగా విమర్శించలేదన్న అలీ.. ఎవరినీ తప్పు మాట అనలేదని గుర్తుచేశారు. ఇకపై తాను ఏ పార్టీ మనిషిని కానని.. ఏ పార్టీకి మద్దతు పలకడం లేదని స్పష్టం చేశారు. సాధారణ మనిషిగా పూర్తిగా సినిమాలు చేసుకుంటానని స్పష్టం చేశారు. ఓటు హక్కు కలిగిన పౌరుడిగా ఓటు వేయడానికి వెళ్తాను తప్ప.. ఇకపై రాజకీయాలకు తనకు సంబంధం లేదని తేల్చేశారు.
మరోవైపు 2019 ఎన్నికలకు ముందు అలీ వైసీపీలో చేరారు. వైసీపీ తరుపున కూడా ప్రచారం చేశారు. ఆ తర్వాత 2022లో వైసీపీ ప్రభుత్వం ఆయనను ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా నియమించింది. ఆ తర్వాత 2024 ఎన్నికల్లో అలీకి వైసీపీ అధిష్టానం సీటు ఇస్తుందని ప్రచారం జరిగింది. గుంటూరు జిల్లాలో ఆయనకు సీటు ఇవ్వవచ్చనే వార్తలు వచ్చాయి. అయితే అలీకి వైసీపీ అధిష్టానం ఆ ఛాన్స్ ఇవ్వలేదు. అయితే 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైంది. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో అలీ రాజకీయాలకు గుడ్ బై చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది.
![]() |
![]() |