విజయవాడలో నడిరోడ్డుపై వ్యాపారి హత్య కలకలంరేపింది. బృందావన్ కాలనీలో కూతురి ముందే వ్యాపారిని ఓ యువకుడు దారుణంగా చంపేశాడు. కూతురి ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు కారణమైంది. భవానీపురంలోని చెరువు సెంటర్కు చెందిన శ్రీరామచంద్ర ప్రసాద్ బృందావన్ కాలనీలో కిరాణాషాపు నడుపుతున్నారు. రోజూ భవానీపురంం నుంచి బృందావన్ కాలనీకి వెళ్లేవారు.. ఆయన కుమార్తె దర్శిని ఇంజనీరింగ్ సెకండియర్ చదువతోంది. అయితే ఆమెకు విద్యాధరపురానికి చెందిన గడ్డం శివమణికంఠతో ఇన్స్టాలో పరిచయం ఏర్పడింది. మణికంఠ విజ్ఞాన్ విహార్ స్కూల్లో పీఈటీ (వ్యాయామ ఉపాధ్యాయుడు)గా పనిచేస్తున్నాడు.
దర్శని, మణికంఠ మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారగా.. నాలుగేళ్లుగా ఇద్దరు ప్రేమలో ఉన్నారు. కూతురి ప్రేమ వ్యవారం రామచంద్ర ప్రసాద్కు తెలిసింది.. దీంతో దర్శినిని హెచ్చరించారు. బాగా చదువుకుని జీవితంలో స్థిరపడాలని.. తన కుమార్తె జోలికి రావొద్దని మణికంఠను మందలించారు. తండ్రికి విషయం తెలియడంతో దర్శిని కొద్దిరోజులుగా మణికంఠను పక్కనపెట్టింది.. మణికంఠ పెళ్లి చేసుకోవాలని చేసిన ప్రతిపాదనను తిరస్కరించింది. శ్రీరామచంద్ర ప్రసాద్ కొంతమందిని తీసుకుని మణికంఠ ఇంటికి వెళ్లి పంచాయితీ కూడా పెట్టారు.
ఆ తర్వాత రోజు నుంచి మణికంఠ ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. గురువారం మణికంఠ తల్లి ఇల్లు వదిలి వెళ్లిపోయింది.దీని అంతటికి దర్శిని తండ్రి శ్రీరామచంద్ర ప్రసాద్ కారణమని మణికంఠ భావించాడు.. ఆయనపై పగ పెంచుకున్నాడు. గురువారం శ్రీరామచంద్రప్రసాద్ భవానీపురం ఇంటి నుంచి కుమార్తెను తీసుకుని బృందావన్ కాలనీలోని కిరాణా షాపునకు వచ్చారు. రాత్రి 9 గంటల సమయంలో షాపు మూసేసిన తర్వాత తండ్రీకూతుర్లు ఇంటికి బయల్దేరారు. అప్పటికే ఆ దగ్గరలోనే మణికంఠ అక్కడికి వచ్చాడు.
మణికంఠ శ్రీరామచంద్ర ప్రసాద్ షాపునకు 100 మీటర్ల దూరంలో ఉన్న ఓ చెట్టు కింద నిలబడి ఉన్నాడు. తండ్రీకూతుళ్లు స్కూటర్పై వస్తుండగా.. ఎదురుగా వెళ్లి బైకును ఢీ కొట్టాడు. శ్రీరామచంద్రప్రసాద్ కిందపడిపోగా.. ఆయనపై కత్తితో దాడి చేశాడు. రోడ్డుపై పడిన తండ్రిని దర్శిని పక్కకు తీసుకెళ్లి కూర్చోబెట్టింది.. ఆ వెంటనే మణికంఠ కత్తితో మరోసారి ఆయన్ను మళ్లీ నరికాడు. దర్శిని అడ్డుకున్న వినకుండా.. దారుణంగా కత్తితో దాడి చేశాడు. ఆ తర్వాత చంపేస్తానని దర్శినిని బెదిరించాడు. తనతో తిరిగిన వీడియోలు సోషల్ మీడియాలో పెడతానని హెచ్చరించాడు.
ఈ ఘటనను గమనించి స్థానికులు అక్కడికి రాగానే మణికంఠ పారిపోయాడు. శ్రీరామచంద్ రప్రసాద్ను వెంటనే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్టు డాక్టర్లు గుర్తించారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసపత్రి మార్చురీకి తరలించారు. కృష్ణలంక పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిందితుడు మణికంఠను పోలీసులు అదుపులోకి తీసుకగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్య ఘటన విజయవాడలో కలకలంరేపింది.
![]() |
![]() |