ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టోల్ గేట్ తీసేయించిన ఎమ్మెల్యే.. ప్రజల ఆనందం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 28, 2024, 08:19 PM

ప్రజా ప్రతినిధులు ప్రజల తరఫున ఆలోచించి తీసుకునే చిన్న నిర్ణయాలు సైతం ఎలాంటి ఆనందాన్నిస్తాయో తెలిపేందుకు ఉదాహరణ ఈ ఘటన. అక్రమంగా టోల్ రుసుం వసూలు చేస్తుంటే, ఏమీ చేయలేక రగిలిపోతున్న విశాఖ, గాజువాక వాసులకు ఎట్టకేలకు ఉపశమనం లభించింది. ఇటీవలి ఎన్నికల్లో గాజువాక నియోజకవర్గంలో టీడీపీ తరఫున గెలుపొంది ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన పల్లా శ్రీనివాసరావు.. టీడీపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ అధికారులతో మాట్లాడి విశాఖ శివారులోని అగనంపూడి టోల్ గేట్‌ను మూసేయించారు. దీంతో వాహనదారులు, స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. టోల్ గేట్ ఎత్తేయడంతో ఈ టోల్ ప్లాజా వద్ద నుంచి వాహనాలు రయ్‌మంటూ దూసుకెళ్తున్నాయి.


విశాఖపట్నం శివారులో కొన్నేళ్ల కిందట అనకాపల్లి నుంచి లంకెలపాలెం, అగనంపూడి ప్రాంతాలను కలుపుతూ గాజువాక మీదుగా విశాఖకు వెళ్లే రహదారిని అభివృద్ధి చేశారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారుల విస్తరణ కార్యక్రమం కింద ఈ రోడ్డును నిర్మించింది. అందుకు అయిన ఖర్చును ప్రజల నుంచి వసూలు చేసేందుకు టోల్‌ గేటును ఏర్పాటు చేశారు.


1997 నాటికి అనకాపల్లి, గాజువాక ప్రాంతాలు పురపాలక సంఘాలుగా ఉన్నాయి. ఎన్‌హెచ్‌ఏఐ నిబంధనల ప్రకారం నగరపాలక, పురపాలక సంఘాల పరిధిలో టోలు వసూలు చేయకూడదు. అందువల్ల ఈ పట్టణాలకు మధ్యలో పంచాయతీగా ఉన్న అగనంపూడిలో టోల్‌ గేటును ప్రారంభించారు. దీని నిర్వహణను ఓ ప్రైవేట్ సంస్థకు అప్పగించారు.


అగనంపూడి టోల్ గేట్ నిర్వహిస్తున్న ప్రైవేట్ సంస్థ.. ఏటా టోల్ రుసుము పెంచుతూ వచ్చింది. జనంపై భారం మోపినా కొంత కాలం భరించారు. అయితే, రహదారి నిర్మాణానికి ఖర్చు చేసిన మొత్తం వసూలైనప్పటికీ టోల్ గేట్‌ మూయకుండా అడ్డగోలుగా టోల్ వసూలు చేశారు. ఇది ప్రజలకు ఆగ్రహం తెప్పించింది. చివరికి ఆర్టీసీ బస్సులకు కూడా మినహాయింపు ఇవ్వకపోవడంతో ప్రజలపై భారం పడింది. అది మరింత ఆగ్రహానికి కారణమైంది.


2019 ఎన్నికలకు ముందు టీడీపీ హయాంలో గాజువాక బార్‌ అసోసియేషన్‌ సభ్యులు కోర్టును ఆశ్రయించి టోల్‌ గేటు మూసేయించారు. అయితే, నాటి ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత ఈ టోల్‌ గేట్‌ను తెరిచి తిరిగి వసూళ్లు మొదలుపెట్టారు. నాటి వైసీపీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ఈ అక్రమ వసూళ్లను అడ్డుకునేందుకు ఏమాత్రం ప్రయత్నించకపోవడమే కాకుండా, ప్రైవేట్ సంస్థ ప్రతినిధులకు వత్తాసు పలికారనే అరోపణలున్నాయి.


గాజువాక టీడీపీ నాయకుడు పల్లా శ్రీనివాసరావు ఈ టోల్ గేట్‌పై పోరాటం ప్రారంభించారు. టీడీపీ కార్యకర్తలతో కలిసి పలుమార్లు ఆందోళనలు నిర్వహించారు. ఇదే సమయంలో జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఈ టోల్ గేట్‌ను నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారంటూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఫిర్యాదు చేశారు. బీజేపీ మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఈ అంశాన్ని పార్లమెంటులోనూ ప్రస్తావించారు. అయినప్పటికీ ఫలితం శూన్యం.


తాను ఎమ్మెల్యేగా గెలిస్తే, అగనంపూడి టోల్ గేట్ తీసేయిస్తానని ఇటీవలి సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో పల్లా శ్రీనివాసరావు హామీ ఇచ్చారు. ఎన్నికల్లో కూటమి తరఫున టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయం సాధించారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మారడం, కేంద్రంలోని సంకీర్ణ ప్రభుత్వం టీడీపీ కీలక భాగస్వామిగా ఉండటం లాంటి పరిణామాలతో టోల్‌ గేట్ దోపిడీకి అడ్డుకట్ట పడింది. పల్లా శ్రీనివాసరావు తాను ఇచ్చిన మాట ప్రకారం.. ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన వెంటనే ఈ టోల్ గేట్‌ను మూసివేయించే చర్యలపై దృష్టి పెట్టారు.


ఎమ్మెల్యే శ్రీనివాసరావు.. కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి మంగళవారం (జూన్ 26) సాయంత్రం అగనంపూడి టోల్‌ గేట్ వద్ద రుసుము వసూళ్లను అడ్డుకున్నారు. ఇకపై టోల్‌ గేట్ వద్ద ఎలాంటి రుసులు వసూలు చేయొద్దని నిర్వాహకులను హెచ్చరించారు. NHAI అధికారులతో మాట్లాడారు. గురువారం ఉదయం మరోసారి టోల్‌ గేట్‌ వద్దకు వచ్చారు. ఆయన అక్కడ ఉండగానే.. సిబ్బంది టోల్ గేటును పూర్తిగా తొలగించారు. దీంతో ఈ టోల్ గేట్‌కు శుభం కార్డు పడింది. స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com