ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జైలుకెళ్లినా పిన్నెల్లికి తప్పని కష్టాలు.. మరో కేసు నమోదు, బ్యాడ్ టైమ్ అంటే ఇదేనేమో

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 28, 2024, 08:02 PM

పల్నాడు జిల్లా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై మరో కేసు నమోదైంది. ఈవీఎం ధ్వంసం కేసులో ఆయనను బుధవారం అర్ధరాత్రి మాచర్ల జూనియర్ సివిల్ కోర్టు లోపలికి తీసుకెళుతున్నారు. ఆ సమయంలో తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు శివను కడుపులో కొట్టిన వీడియో వైరలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తనపై పిన్నెల్లి దాడికి పాల్పడ్డారని శివ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. రామకృష్ణారెడ్డిపై 303 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.


ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ రోజున పల్నాడు జిల్లా పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం, ఎన్నికల అల్లర్ల కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయ్యారు. ఆయనకు మాచర్ల కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. అయితే మాచర్ల జూనియర్‌ సివిల్‌ జడ్జి ముందు హాజరుపరచగా.. న్యాయమూర్తి నెల్లూరు జైలుకు తరలించాలని ఆదేశించారు. అయితే పిన్నెల్లి అరెస్ట్‌తో మాచర్ల నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు టపాసులు కాల్చి సంచరాలు చేసుకున్నారు. అయితే పిన్నెల్లిని పోలీసులు నెల్లూరు జైలుకు తరలిస్తున్న సమయంలో టీడీపీ కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకున్నారు. రామకృష్ణారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఒక టీడీపీ నేత శివ పిన్నెల్లి ముందుకు వెళ్లి నిలబడగా.. ఆయన ఆ టీడీపీ నేత పొట్టలో గుద్దారు. దీంతో శివ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.


అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ రోజు మాచర్ల నియోజకవర్గంలోని రెంటచింతల మండలం పాల్వాయిగేటు పోలింగ్‌ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం చేయడం, అడ్డుకోబోయిన టీడీపీ పోలింగ్‌ ఏజెంట్‌పై దాడి చేయడంపై పోలీసులు పిన్నెల్లిపై కేసులు నమోదు చేశారు. పోలింగ్‌ మరుసటి రోజు కారంపూడిలో అరాచకం సృష్టించడం, అడ్డుకోబోయిన సీఐపై దాడి చేసిన కేసుల్లో పిన్నెల్లితో పాటు ఆయన తమ్ముడు, అనుచరులపై కారంపూడి పోలీసులు కేసులు పెట్టారు. ఈ నాలుగింటిలోనూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన నిందితుడిగా ఉన్నారు. అయితే ఇన్నాళ్లు పిన్నెల్లిని అరెస్టు చేయకుండా ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. మొదట జూన్‌ 6 వరకూ అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ మే 28న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను హైకోర్టు ఇప్పటికే 3 సార్లు పొడిగించడంతో పిన్నెల్లి పోలీసుల ఆధీనంలో ఉంటూ ప్రతి రోజూ ఎస్పీ కార్యాలయానికి వచ్చి సంతకం చేస్తున్నారు.


ఈ వెసులుబాటు గడువు ముగియడం, బెయిల్‌ పిటిషన్లనూ హైకోర్టు రద్దు చేయడంతో బుధవారం నరసరావుపేట మండలం రావిపాడు పరిధిలోని విల్లాలో ఉన్న ఆయన్ను నరసరావుపేట రూరల్‌ సీఐ మల్లికార్జున్‌ అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి పోలీసు వాహనంలో కాకుండా పిన్నెల్లి సొంత కారులోనే ఎస్పీ కార్యాలయానికి తరలించారు. అనంతరం ఈ కేసులను విచారిస్తున్న గురజాల డీఎస్పీ శ్రీనివాసరావు, కారంపూడి సీఐ శ్రీనివాసరావుల ఆధ్వర్యంలో అరెస్టు చేశారు. నరసరావుపేట ప్రభుత్వ ప్రధాన ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. బందోబస్తు మధ్య నరసరావుపేట నుంచి గురజాల మీదుగా మాచర్ల కోర్టుకు తరలించారు. వాదనలు విన్న కోర్టు పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com