ఆంధ్రప్రదేశ్లో పింఛన్లు (ఎన్టీఆర్ భరోసా) పంపిణీకి సంబంధించి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. జులై 1వ తేదీన లబ్ధిదారుల ఇళ్ల దగ్గరే అందించేందుకు ఏర్పాట్లు చేయాలని సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. పింఛన్ల పంపిణీపై సీఎస్ నీరభ్ కుమార్ సచివాలయంలో జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సోమవారం ఒక్కరోజే సాధ్యమైనంత వరకు పింఛన్లు పంపిణీ పూర్తి చేయాలని సూచించారు. ఒకవేళ ఎవరైనా మిగిలితే మంగళవారం (జులై 2న) అందజేయాలన్నారు. సోమవారం (జులై 1న) ఉదయం 6 గంటలకే పింఛన్ల పంపిణీ ప్రారంభించాలని ఆదేశించారు.
ఇళ్ల దగ్గర పింఛన్ల పంపిణీ చేసేందుకు అవసరమైన డబ్బుల్ని ఈ నెల 29న బ్యాంకుల నుంచి డ్రా చేసుకుని సిద్ధంగా ఉంచుకోవాలని సీఎస్ సూచించారు. కొత్తగా పెంచిన పింఛన్ల మేరకు 65.18 లక్షల మందికి రూ.4,399.89 కోట్లు పంపిణీ చేయనున్నారు. వీరిలో 64.75 లక్షల మందికి ఇళ్ల దగ్గరే పింఛన్లు పంపిణీ చేస్తారు.. మిగిలిన 43 వేల మంది బయటి రాష్ట్రాల్లో చదువుకునే దివ్యాంగ విద్యార్థులు ఉన్నారు. వీరికి బ్యాంకు అకౌంట్లలో జమ చేస్తారు. ఒక్కో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగికి 50 పింఛన్లను అప్పగించాలని ఇప్పటికే సూచించారు. పింఛన్ లబ్ధిదారుల వివరాలను శుక్రవారం లోపు మ్యాపింగ్ చేస్తారు.
వృద్ధులు, వితంతువులు తదితర 11 ఉప విభాగాలకు చెgదినవారి పింఛను రూ.3వేల నుంచి రూ.4వేలకు పెంచింది ప్రభుత్వం. ఏప్రిల్ నెల నుంచి పెంచిన పింఛన్ అందజేస్తామని ఇప్పటికే ప్రకటించారు.. అంటే జులై నెలకు సంబంధించి రూ.4 వేలతో పాటు ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన రూ.3వేలు కలిపి మొత్తం రూ.7వేలు పంపిణీ చేస్తారు. రెండో కేటగిరీ విషయానికి వస్తే.. పాక్షికంగా వైక్యలం ఉన్న దివ్యాంగులకు రూ.3వేల నుంచి రూ.6వేలకు పింఛన్ పెంచారు. మూడో కేటగిరీలో పూర్తిస్థాయి వైకల్యం ఉన్న దివ్యాంగులకు రూ.5 వేల నుంచి రూ.15 వేలకు పింఛన్ పెరిగింది. నాలుగో కేటగిరీలోని కిడ్నీ, తలసేమియా వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి రూ.5వేల నుంచి రూ.10వేలకు పింఛను పెంచారు.
అంతేకాదు ఇళ్ల దగ్గర పంపిణీ చేసే పింఛన్ డబ్బుల్ని 29వ తేదీ శనివారం సంబంధిత బ్యాంక్ బ్రాంచ్ల నుంచి డ్రా చేసుకుని సిద్ధంగా ఉంచుకోవాలని సీఎస్ కలెక్టర్లకు సూచించారు. ఇళ్ల దగ్గరే పింఛన్లు పంపిణీ చేసేందుకు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతో పాటు అవసరం అయితే ఇతర శాఖల ఉద్యోగుల సేవలను కూడా వినియోగించుకోవాలని సూచనలు చేశారు. ఒక్కో ఉద్యోగి 50 ఇళ్లకు పింఛన్లు పంపిణీచేసేలా క్లస్టర్ల వారీగా మ్యాపింగ్ కార్యక్రమాన్ని శుక్రవారానికి పూర్తి చేయమని ఆదేశించారు.
![]() |
![]() |