ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం అమరావతి రైతులు మరోసారి పెద్ద మనసు చాటుకున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక రైతులు.. రాజధాని అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణానికి భూములు ఇస్తామని తెలిపారు. ఈ మేరకు సంసిద్ధత వ్యక్తం చేశారు. పెనుమాక గ్రామ సచివాలయంలో సీఆర్డీఏ డిప్యూటీ కలెక్టర్ విశ్వేశ్వరనాయుడితో రైతులు సమావేశం అయ్యారు. పెనుమాక గ్రామ పరిధిలో పది మందికి సంబంధించి 3.21 ఎకరాలు సేకరించాల్సి ఉందని సీఆర్డీఏ అధికారులు తెలిపారు.
రాజధాని అమరావతి కోసం గతంలో భూములిచ్చిన రైతులకు.. ఎకరాకు డెవలప్మెంట్ ప్లాట్లు కింద 1,450 గజాలు అందజేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా అదే ప్రాతిపదికన భూములు ఇవ్వాలని రైతుల్ని సీఆర్డీఏ అధికారులు కోరారు. డ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణానికి భూములు ఇచ్చేందుకు (భూ సేకరణ) తమకు ఎలాంటి అభ్యంతరం లేదని.. కానీ 2,000 నుంచి 2,400 గజాల స్థలం ఇవ్వాలని రైతులు అధికారుల్ని కోరారు.
తుళ్లూరు మండలం గ్రామాల్లో మార్కెట్ ధర ప్రకారం ఎకరా రూ.3 లక్షలు ఉంటే.. తమ గ్రామమైన పెనుమాకలో రూ.8 లక్షలు పలుకుతుందని అధికారులకు తెలిపారు. ఈ విషయాన్ని సీఆర్డీఏ కమిషనర్ దృష్టికి తీసుకువెళతామని.. ఒకవేళ భూ సమీకరణకు రానిపక్షంలో భూసేకరణ చేయాల్సి ఉంటుందని డిప్యూటీ కలెక్టర్ రైతులకు తెలిపారు. సీఆర్డీఏ కమిషనర్ రైతుల వినతిపై ఎలా స్పందిస్తారన్నది చూడాలి.. త్వరలోనే ఈ అంశంపై క్లారిటీ రానుంది.
![]() |
![]() |