పోలీసుల అప్రమత్తత నిండు ప్రాణాన్ని కాపాడింది. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో చోటుచేసుకుంది. ఇంట్లో గొడవలు కావటంతో దూడల నాగలక్ష్మి అనే మహిళ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించింది. దీంతో రాజమండ్రిలోని రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జి మీదకు చేరుకుంది. అక్కడి నుంచి గోదావరిలోకి దూకింది. అయితే అటుగా వెళ్తున్న కొంతమంది ఈ విషయాన్ని గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఇక పోలీసులు కూడా వేగంగా స్పందించారు. అక్కడే ఉన్న జాలర్లకు సమాచారం చేరవేశారు.
దీంతో సినిమా స్టైల్లో బోటులో అక్కడకు చేరుకున్న జాలర్లు.. మహిళను కాపాడారు. బోటు సాయంతో వేగంగా మహిళ ఉన్న ప్రాంతానికి చేరుకున్న ముగ్గురు జాలర్లు.. నదిలో మునిగిపోతున్న మహిళను కాపాడారు. బోటులోకి ఎక్కించి ఒడ్డుకు చేర్చారు. అనంతరం ఘటనాస్థలికి చేరుకున్న రాజమండ్రి పోలీసులు.. మహిళను స్టేషన్కు తీసుకెళ్లారు. కుటుంబ కలహాల కారణంగానే ఆత్మహత్యకు యత్నించినట్లు తెలుసుకున్నారు. అనంతరం ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చి.. బంధువులకు అప్పగించారు. అయితే మహిళ గోదాట్లోకి దూకడం, జాలర్లు వేగంగా అక్కడకు చేరుకుని కాపాడటాన్ని స్థానికులు ఫోన్లో రికార్డు చేశారు. ఈ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మరోవైపు స్థానికులు ఇచ్చిన సమాచారానికి పోలీసులు వేగంగా స్పందించడాన్ని స్థానికులు, నెటిజన్లు ప్రశంసిస్తన్నారు. వెంటనే జాలర్లను పంపి, మహిళను కాపాడటాన్ని కొనియాడుతున్నారు. దీనిపై రాజమండ్రి టూటౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ రత్తయ్య, కానిస్టేబుల్ లీల కుమార్లను అభినందిస్తున్నారు.
![]() |
![]() |