ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్ర విభజనతో జరిగిన నష్టం కంటే.. వైఎస్ జగన్ పాలనతో జరిగిన నష్టమే ఎక్కువ.. చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 28, 2024, 07:37 PM

పోలవరం ప్రాజెక్టు మీద ఏపీ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పోలవరం జాతీయ ప్రాజెక్టు మీద తొలి శ్వేతపత్రం రిలీజ్ చేశారు. గత ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును నిర్వీర్యం చేసిందని చంద్రబాబు మండిపడ్డారు. వైఎస్ జగన్ పోలవరం పాలిట శాపంగా మారారన్న చంద్రబాబు నాయుడు. వైసీపీ పాలనలో రాష్ట్రం నాశనమైందని విమర్శించారు. 2019లో సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేసిన రోజే.. పోలవరం ఆపేయాలని ఆదేశించారని చంద్రబాబు ఆరోపించారు. నిరాధార ఆరోపణలపై కాంట్రాక్టర్‌ను మార్చారని.. రివర్స్ టెండరింగ్ పేరుతో ప్రాజెక్టును సర్వనాశనం చేశారని చంద్రబాబు మండిపడ్డారు. ఏజెన్సీని మార్చకపోతే ఐదేళ్లలో పోలవరం ప్రాజెక్టు పూర్తి అయ్యేందని చంద్రబాబు చెప్పారు.


మరోవైపు 2014- 19 మధ్య పోలవరం ప్రాజెక్టును 72 శాతం పూర్తిచేశామన్న చంద్రబాబు.. వైసీపీ పాలనలో ప్రాజెక్టును నాశనం చేశారని ఆరోపించారు. రాష్ట్ర విభజన వలన జరిగిన నష్టం కంటే వైసీపీ పాలనలోనే ఏపీకి ఎక్కువ నష్టం జరిగిందని చంద్రబాబు ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు కోసం కేంద్రం ఇచ్చిన నిధుల్లో రూ.3,385 కోట్లు దారి మళ్లించారని చంద్రబాబు ఆరోపించారు. ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు కోసం రూ.4,161 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని చెప్పారు. వైఎస్ జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో రూ.4,900 కోట్లు నష్టం జరిగిందనీ.. పోలవరం ఆలస్యంతో రైతులకు రూ.45,000 కోట్లు నష్టం వాటిల్లిందని చెప్పారు. వైఎస్ జగన్ ప్రభుత్వ అసమర్థతతో గైడ్ బండ్ కుంగిపోయిందని ఆరోపించారు.


పోలవరంలో డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని ఐఐటీ హైదరాబాద్ చెప్పిందన్న చంద్రబాబు.. పోలవరం మరమ్మత్తుల కోసం అమెరికా, కెనడా నుంచి నిపుణులను రప్పిస్తామని చెప్పారు. వారు ఇక్కడే ఉండి పనులను పర్యవేక్షిస్తారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో, అంతర్జాతీయ, దేశీయ నిపుణుల తోడ్పాటుతో పోలవరం ప్రాజెక్టులో సవాళ్లను అధిగమిస్తామని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు పోలవరం ప్రాజెక్టుపై సీఎంగా వైఎస్ జగన్ మాట్లాడిన వీడియోలను ప్రదర్శించిన చంద్రబాబు.. మాజీ సీఎం మీద విమర్శలు గుప్పించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com