ప్రకృతి అందాలకు కేరాఫ్ అడ్రస్ పాపికొండలు. ఏపీలోని తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల మధ్యన ఈ పాపికొండలు ఉన్నాయి. ఈ పాపికొండలు చూడ్డానికి తెలుగు రాష్ట్రాల ప్రజలే కాదు.. పొరుగు రాష్ట్రాలవారు కూడా తరలివస్తుంటారు. ప్రకృతి అందాలను చూస్తూ మైమరిచిపోతుంటారు. గోదావరి నదిలో బోటుపై రైడింగ్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. పాపికొండల నడుమ గోదావరిలో లాంచీ ప్రయాణం, అక్కడి వాతావరణం అందరినీ కట్టిపడేస్తాయి. అయితే పాపికొండలు పర్యటనకు వెళ్లేవారికి షాకింగ్ న్యూస్. పాపికొండలు విహారయాత్రకు బ్రేక్ పడింది. విహారయాత్రను నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఏపీలో రుతుపవనాలు విస్తరించాయి. రుతుపవనాల ప్రభావంతో ఏపీలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల ప్రభావంతో గోదావరి నదిలో నీటి ఉద్ధృతి పెరిగింది. దీంతో పాపికొండలు విహారయాత్రను నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. నదిలో వరద ప్రవాహం పెరిగిన నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా విహారయాత్రను నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అనుమతి లేకుండా ఎవరైనా పాపికొండల పర్యటనకు వెళ్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రస్తుతానికి నాలుగు రోజుల పాటు యాత్రను నిలిపివేశామని.. ఆ తర్వాత పరిస్థితులను అనుసరించి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
2019లో కచ్చలూరు బోటు ప్రమాదం తర్వాత పాపికొండల విహారయాత్రను ప్రభుత్వం నిలిపివేసింది. అయితే ఆ తర్వాత 2021 నవంబర్ ఏడో తేదీన తిరిగి పాపికొండల విహారయాత్రను ప్రారంభించారు. అయితే అప్పట్లో జరిగిన ప్రమాదం నేపథ్యంలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా.. గోదావరిలో వరద ప్రవాహం పెరగటంతో.. విహారయాత్రకు బ్రేక్ వేశారు. పాపికొండల పర్యటన కోసం ప్రభుత్వ బోట్లతో పాటుగా ప్రైవేట్ బోట్లు కూడా అందుబాటులో ఉంటాయి.
![]() |
![]() |