ఏపీకి జీవనాడిగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కుంటుపడిన సంగతి తెలిసిందే. ఇటీవలే అధికారం చేపట్టిన ఎన్డీయే కూటమి ప్రభుత్వం ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను బయటపెట్టింది. ఏపీ సీఎం నారా చంద్రబాబు పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. పోలవరం ఆంధ్రప్రదేశ్కు జీవనాడి అని, అలాంటి ప్రాజక్టును 5 ఏళ్లపాటు (2019-24) ఎలా విధ్వంసం చేసారో ఈ సందర్భంగా చంద్రబాబు వివరించారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పడు పోలవరం పనులు ఒక యజ్జంలా సాగాయని, అప్పట్లో ఉన్న సమస్యలను, సవాళ్లను అధిగమించి మరీ ముందుకు వెళ్లామని చంద్రబాబు గుర్తుచేశారు. ఒక్క రోజులోనే స్పిల్ ఛానల్లో 32,215 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు చేసి నాటి ప్రభుత్వం గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సాధించిందని చంద్రబాబు గుర్తుచేశారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అటు హెడ్ వర్కుల పనులు చేస్తూనే ఎగువ, దిగువ కాఫర్ కాఫర్ డ్యాంల నిర్మాణం పనులు పూర్తి చేశామని చెప్పారు. ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రం వాల్ నిర్మాణాన్ని రికార్డు సమయంలో 414 రోజుల్లో పూర్తి చేశామని చంద్రబాబు ప్రస్తావించారు.
![]() |
![]() |