ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అప్పు ఇవ్వలేదనే కోపం.. స్నేహితుడి సాయంతో ఇంటి ఓనర్‌ను వివస్త్రను చేసి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 28, 2024, 07:29 PM

పల్నాడు జిల్లా కారంపూడి మండలం ఒప్పిచర్లలో జరిగిన మహిళ దారుణహత్య కేసులో మిస్టరీ వీడింది. మహిళను హత్య చేసింది.. ఆమె ఇంట్లో అద్దెకు ఉంటున్నవారేనని పోలీసులు తేల్చారు. హత్య చేయడానికి ముందు ఆమెపై అఘాయిత్యం జరిగినట్లు తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలను పల్నాడు ఎస్పీ మల్లికా గార్గ్ వెల్లడించారు. మద్యాన్ని అప్పుగా ఇవ్వలేదనే కారణంతోనే ఈ దారుణానికి ఒడిగట్టినట్లుగా పోలీసులు చెప్తున్నారు. కారంపూడి మండలం ఒప్పిచర్లకు చెందిన 53 ఏళ్ల మహిళ గురువారం హత్యకు గురైంది. మహిళను కర్రతో కొట్టి అత్యాచారం చేసి, ఆపై హత్యచేసినట్లు పోలీసులు గుర్తించారు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా దీనికి కారణమైన ఇద్దరిని గుర్తించిన పోలీసులు.. వారిని అరెస్ట్ చేశారు.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలు ఓ బడ్డీ కొట్టు నడుపుతూ ఉండేది. దానితోపాటు బెల్టు దుకాణం నిర్వహించేవారు. వీరికి రెండు ఇళ్లు ఉండగా.. ఓ ఇంటిని అద్దెకు ఇచ్చారు. అద్దెకు ఇచ్చిన ఇంటిలో రామావత్ బాబు నాయక్ అనే వ్యక్తి బాడుగకు ఉంటున్నాడు. అయితే బాధితురాలి బడ్డీ కొట్టు వద్ద బాబు నాయక్ మద్యం తాగుతూ ఉండేవాడు. ఈ క్రమంలోనే ఆమె దగ్గర అప్పుచేసి మరీ మద్యం తాగడం మొదలెట్టాడు. అయితే ఇటీవల ఓ రోజు తన స్నేహితుడు బాలూ నాయక్‍తో కలిసి మద్యం తాగేందుకు వెళ్లాడు బాబు నాయక్. అయితే బాధితురాలు అప్పు ఇచ్చేందుకు నిరాకరించింది. గతంలో అప్పు ఉన్న డబ్బులు తిరిగి ఇస్తేనే మందు ఇస్తానని తెగేసి చెప్పింది.


దీంతో బాబూ నాయక్, బాలూ నాయక్ ఆమెపై కోపం పెంచుకున్నారు. ఈ క్రమంలోనే గురువారం రాత్రి ఇంటికి వచ్చి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. వివస్త్రను చేసిన అత్యాచారం చేయడమే కాకుండా.. కర్రతో కొట్టి హత్య చేశారు. బాధితురాలి భర్త ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. దర్యాప్తు జరిపి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కోర్డు ఎదుట హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. అయితే ఇంట్లో బాడుగకు ఉన్న వ్యక్తే ఇంత దారుణానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com