నందికొట్కూరు పట్టణంలో ఆక్రమణకు గురైన మున్సిపల్ స్థలాలను స్వాధీనం చేసుకోవాలని మున్సిపల్ అధికారులను నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య ఆదేశించారు. గురువారం పట్టణంలోని ముబారక్ ఫంక్షన్ హాల్ వెనుక భాగంలో ఆక్రమణకు గురైన మున్సిపాలిటీ స్థలాన్ని ఆయన పరిశీలించారు. మున్సిపాలిటీకి చెందిన స్థలం ఎలా కబ్జాకు గురవుతుందని టౌన్ ప్లానింగ్ అధికారులను ఆయన ప్రశ్నించారు. పట్టణంలో ఎక్కడెక్కడ మున్సిపాలిటీ స్థలాలు ఉన్నాయో వాటిలో పిచ్చిమొక్కలను తొలగించి 24 గంటల్లో బౌండరీలు ఏర్పాటు చేసి, మున్సిపాల్టీ బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ తనిఖీల్లో టీపీవో బాలమద్దయ్య, పట్టణాధ్యక్షుడు బాస్కర్రెడ్డి, వైస్ చైర్మన్ రబ్బాని, కౌన్సిలర్ జాకీర్, ముర్తుజావళి, జమీల్, సౌదీ చాంద్, గని, రాజు, రాజన్న తదితరులు ఉన్నారు. మున్సిపాలిటీ పరిధిలో పని చేస్తున్న ఇంజనీరింగ్ కార్మికులు, డైలీ కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యేకు వినతిపత్రం సమర్పించారు. సీఐటియూ జిల్లా ఉపాధ్యక్షుడు భాస్కర్రెడ్డి, మున్సిపల్ వర్కర్స్ నాయకుడు పరమేష్ మాట్లాడుతూ ఇంజనీరింగ్ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు, ఎనిమిది సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలుగా పని చేస్తున్న 52 మంది దినసరి కార్మికులను ఆప్కోసులో కలిపి వారికి కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని కోరారు. సీఐటియూ నాయకులు నాగన్న, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.