ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్పామ్, అవాంఛిత వాణిజ్య ప్రకటనలపై ఫిర్యాదు చేసే ఆప్షన్ తీసుకొచ్చిన బీఎస్ఎన్ఎల్

business |  Suryaa Desk  | Published : Sun, Oct 06, 2024, 02:29 PM

ప్రైవేటు టెలికం ఆపరేటర్లు అయిన జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా (వీఐ)కి ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ ఇటీవలి కాలంలో గట్టి పోటీ ఇస్తోంది. ఆ సంస్థలు తమ టారిఫ్ ధరలను ఎడాపెడా పెంచేయడంతో ఖాతాదారులు ఇప్పుడు బీఎస్ఎన్ఎల్‌ వైపు మొగ్గుచూపుతున్నారు. ఇటీవలి కాలంలో ఆ సంస్థ వినియోగదారుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. పాత వినియోగదారులు సైతం నంబర్ పోర్టబిలిటీ ద్వారా బీఎస్ఎన్ఎల్‌కు మారుతున్నారు. అతి త్వరలోనే బీఎస్ఎన్ఎల్ నుంచి దేశవ్యాప్తంగా 4జీ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం 5జీ సేవలు కూడా అందుబాటులోకి తెచ్చేందుకు ఆ సంస్థ ప్రయత్నిస్తోంది. బీఎస్ఎన్ఎల్ తాజాగా తమ వినియోగదారుల కోసం మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. స్పామ్, అవాంఛిత వాణిజ్య ప్రకటనలు (యూసీసీ)పై ఫిర్యాదు చేసే అవకాశాన్ని అందుబాటులోకి తెచ్చింది. మోసపూరిత ఎస్సెమ్మెస్‌లు, వాయిస్ కాల్స్‌పై బీఎస్ఎన్ఎల్ యూజర్లు ఇప్పుడు సెల్ఫ్‌కేర్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ఇప్పటి వరకు ఇలాంటి సదుపాయాన్ని దేశంలోని మరే టెలికం సంస్థ అందుబాటులోకి తీసుకురాలేదు.  తొలుత బీఎస్ఎన్ఎల్ సెల్ఫ్‌కేర్ యాప్‌ను ఓపెన్ చేయాలి. హోంపేజీలో పైన ఎడమవైపు ఉన్న మూడు లైన్లపై క్లిక్ చేయాలి. ఆ తర్వాత స్క్రోల్ చేస్తూ కిందికి వస్తే ‘కంప్లైంట్ అండ్ ఫ్రిఫరెన్స్’ ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ కుడివైపున ఉన్న మూడు గీతలపై క్లిక్ చేస్తే చూజ్ ‘కంప్లైంట్స్’ అన్న ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ ‘న్యూ కంప్లైంట్’పై క్లిక్ చేయాలి. అందులో మనం వాయిస్ ద్వారా కానీ, లేదంటే ఎస్సెమ్మెస్ ద్వారా కానీ కంప్లైంట్ చేసుకునే ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ మనకు అనుకూలంగా ఉన్న దానిపై కంప్లైంట్ చేస్తేసరి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com