అప్పటివరకు ఎంతో ఆనందంగా ఒకరికి ఒకరు తోడుగా ఉంటూ సొంత ఇంటినిర్మాణ పనులు చేసుకుని వెళ్లిన ఆ దంపతులను విద్యుత్ తీగలు బలితీసుకున్నాయి. విద్యుత్ షాక్ తగిలిన భార్యను కాపాడేందుకు వెళ్లిన భర్త కూడా విగతజీవిగా పడి మృతి చెందిన ఘటన గురువారం సాయంత్రం తాడేపల్లిగూడెంలో జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలివి.. తాడేపల్లిగూడెం గాంధీ బొమ్మ సెంటర్ వద్ద నివాసం ఉంటున్న గట్టిం వెంకన్న(60) ఇంటి నిర్మాణ పనులు చేసుకుని జీవనం సాగిస్తుంటాడు. గురువారం ఉదయం భార్య అన్నపూర్ణ (55)తో కలిసి ప్రభుత్వం కేటాయించిన స్థలంలో ఇంటి నిర్మాణం చేసేందుకు వెళ్లి పనులు పూర్తి చేయించుకుని ఇంటికి వచ్చారు. మంచినీటి కోసం మోటారు ఆన్చేసేందుకు వెళ్లిన అన్నపూర్ణకు విద్యుత్ వైర్లు తగిలి షాక్కు గురై కేకలు వేయగా కాపాడేందుకు వచ్చిన భర్త వెంకన్న కూడా అక్కడికక్కడే విగత జీవిగా పడిపోయాడు. స్థానికులు గమనించే సరికే ఇద్దరూ మృతి చెందారు. వారికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ సుబ్రహ్మణ్యం తెలిపారు. సంఘటనా స్థలం వద్ద మృతులను ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పరిశీలించి కుటుంబ సభ్యులను ఓదార్చారు.