ప్రతిరోజు ఉదయం పేపర్ తెరవగానే.. కచ్చితంగా కనిపించే వార్త రోడ్డు ప్రమాదాలు. నిత్యం ఎక్కడో ఓ చోట, ఏదో ఒక మూల ప్రమాదం జరుగుతూనే ఉంది. ప్రాణం పోతూనే ఉంది. ప్రమాదాల నివారణకు ప్రభుత్వాలు నిబంధనలు కఠినతరం చేస్తున్నా పట్టించుకునే నాథుడేడీ. నిబంధనలు పాటించటంలో.. ఏం కాదులే అనే అలుసో.. మనల్ని ఎవడేం చేస్తాడనే నిర్లక్ష్యమో తెలియదు కానీ.. తప్పు ఎవరిది అయినా ప్రాణం పోతోంది.. బాధితుల కుటుంబాల్లో గుండె కోత మిగులుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. బైక్ నడిపేవారి విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.ఏపీలో బైక్లు నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని హైకోర్టు ఆదేశించింది. హెల్మెట్ ధరించకుండా వాహనం నడిపితే.. కేసులు నమోదు చేయవచ్చంటూ పోలీసులకు సూచించింది.
ఏపీలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని.. హెల్మెట్ ధరించకపోవటం చాలా మరణాలకు కారణమవుతోందంటూ న్యాయవాది యోగేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బైక్లు, ద్విచక్రవాహనాలు నడిపేవారు హెల్మెట్ ధరించేలా ఆదేశాలివ్వాలని పిటిషన్లో కోరారు. ఈ పిటిషన్ మీద ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏపీలో ద్విచక్రవాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ ఇకపై తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని హైకోర్టు ఆదేశించింది. అలాగే హెల్మె్ట్ పెట్టుకోకుండా బైక్లు నడిపేవారిపై కేసులు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. ఇక వాహనాల తనిఖీకి సంబంధించి కూడా పోలీసులకు కీలక సూచనలు చేసింది. వాహనాలను తనిఖీ చేసే సమయంలో పోలీసులు కచ్చింతగా బాడీ కెమెరాలను ధరించాలని కోర్టు స్పష్టం చేసింది.
మరోవైపు కోర్టు తీర్పు పట్ల పిటిషనర్ హర్షం వ్యక్తం చేశారు. హెల్మెట్ ధరించకుండా వాహనాలను నడపడం ద్వారా రోడ్డు ప్రమాదాల్లో మరణాల శాతం పెరుగుతోందన్నారు. వాహనాన్ని నడిపే సమయంలో హెల్మెట్ ధరిస్తే.. ప్రమాదం జరిగినా.. ప్రాణాలు మీదకు వచ్చే అవకాశాలు తక్కువని చెప్తున్నారు. మరి కోర్టు ఆదేశాల తర్వాతైనా ఏపీలో పరిస్థితి మారాలని ఆశిద్దాం.