ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైఎస్ జగన్‌‌కు టీడీపీ నేత ఆఫర్.. అలా చేస్తే ప్రతిపక్ష నాయకుడి హోదా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 26, 2024, 08:05 PM

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడికి రాసిన లేఖ ఏపీలో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని.. అలా అయితేనే వైసీపీ ప్రతిపక్ష హోదాతో ప్రజా సమస్యలపై శాసనసభలో ప్రశ్నించగలుగుతుందని అందులో పేర్కొన్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే సభలో పదిశాతం సీట్లు ఉండాలనే నిబంధన చట్టంలో ఎక్కడా లేదని వైఎస్ జగన్ లేఖలో ప్రస్తావించారు. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చే విషయంలో ఆలోచించాలని లేఖలో కోరారు. అయితే వైఎస్ జగన్ రాసిన లేఖపై టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ నేత, జాతీయ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు ఓ ఆఫర్ ఇచ్చారు.


వైఎస్ జగన్ ప్రతిపక్ష నాయకుడి హోదా కావాలంటున్నారని అలా చేస్తే ఆయనకే ప్రతిపక్ష లీడర్ హోదా దక్కుతుందని చెప్తున్నారు. శాసనమండలిలో ప్రతిపక్ష నాయకుడి పాత్రను పోషించేందుకు వైఎస్ జగన్‌కు మంచి అవకాశం ఉందన్నారు జీవీ రెడ్డి. వైఎస్ జగన్ పులివెందుల ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేస్తే.. తాము గవర్నర్ కోటా కింద వైఎస్ జగన్‌ను ఎమ్మెల్సీగా మండలికి నామినేట్ చేస్తామన్నారు. ఆ రకంగా మండలిలో ప్రతిపక్ష నాయకుడి పదవి దక్కుతుందంటూ సెటైర్లు వేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఈ ట్వీట్ చేశారు.


" శాసనమండలిలో ప్రతిపక్ష నాయకుడు అవ్వడానికి వైఎస్ జగన్ గారికి అవకాశం ఉంది. ఎమ్మెల్యేగా రాజీనామా చేయమని ఆయనకు నేను సూచిస్తున్నా. అలా రాజీనామా చేస్తే గవర్నర్ కోటా ఎమ్మెల్సీ కింద ఆయనను ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తాం. ఆ రకంగా ఆయన సులభంగా మండలిలో విపక్ష నేత హోదాను పొందవచ్చు. అయితే శాసనమండలిని రద్దు చేయాలని ఇంకెప్పుడూ వైఎస్ జగన్ డిమాండ్ చేయకూడదు" అని జీవీ రెడ్డి సెటైరికల్ ట్వీట్ చేశారు.


మరోవైపు 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకీ కేవలం 11 ఎమ్మెల్యే సీట్లు మాత్రమే వచ్చాయి. 2019 ఎన్నికల్లో 151చోట్ల గెలిచిన వైసీపీ.. 11 సీట్లకు పరిమితమైంది. దీంతో ఏపీ అసెంబ్లీలో ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కలేదు. ప్రతిపక్ష హోదా దక్కాలంటే శాసనసభలోని మొత్తం సీట్లల్లో 10 శాతం సీట్లు రావాలని టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. ఆ రకంగా 175 సీట్లు ఉన్నా ఏపీ అసెంబ్లీలో.. ప్రతిపక్ష హోదా దక్కాలంటే కనీసం 18 సీట్లు రావాల్సి ఉంది. అయితే వైసీపీకి 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉండటంతో ప్రతిపక్ష హోదా రాలేదు. ఈ క్రమంలోనే 18 మంది సభ్యులు ఉండాలనే నిబంధనల లేదంటూ వైఎస్ జగన్.. స్పీకర్ అయ్యన్నపాత్రుడికి లేఖరాశారు. దీనిపైనే టీడీపీ నేతలు సెటైర్లు పేలుస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com