ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తర్వాత ఇస్తా అంటూ లేఖ రాసిపెట్టిన ‘దొంగ

national |  Suryaa Desk  | Published : Fri, Jul 05, 2024, 08:06 PM

ఓ ఇంట్లో దొంగతనానికి వెళ్లిన దొంగ.. ఊహించని పని చేసి బయటికి వచ్చాడు. దొంగతనానికి వెళ్లిన ఆ దొంగ.. ఇంట్లో ఉన్న డబ్బు.. బంగారు, వెండి ఆభరణాలు చోరీ చేశాడు. ఆ తర్వాత తాను దొంగతనం చేయడానికి గల కారణాన్ని ఓ పేపర్‌పై రాసి పెట్టి వెళ్లిపోయాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో గుట్టుచప్పుడు కాకుండా దొంగతనం చేసి బయటపడ్డాడు. అయితే ఆ తర్వాత ఇంటికి వెళ్లి చూసిన యజమానికి తన ఇంట్లో దొంగతనం జరిగిందని అర్థం అయింది. అక్కడే ఒక లేఖ కనిపించగా.. దాన్ని చదివిన ఆ ఇంటి యజమానికి ఏం చేయాలో అర్థం కాలేదు. అయితే ఆ లేఖ కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి రకరకాల రియాక్షన్స్ వస్తున్నాయి. ఈ సంఘటన తమిళనాడులో చోటు చేసుకుంది.


తమిళనాడు తూత్తుకుడి జిల్లాలోని మేగ్నానపురంలో ఈ దొంగతనం జరిగింది. సాతాంకులం రోడ్డులో ఉన్న ఓ రిటైర్డ్ టీచర్ ఇంట్లో ఓ వ్యక్తి దొంగతనం చేశాడు. అయితే చిత్రాయ్ సెల్విన్ అనే రిటైర్డ్ టీచర్.. తన కుటుంబ సభ్యులతో కలిసి వేరే ఊరికి వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. చిత్రాయ్ సెల్విన్, ఆయన భార్య ఇద్దరూ రిటైర్డ్ టీచర్లు. అయితే వారికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నాడు. అయితే ఇటీవల వారి కుమారుడికి ఒక కుమార్తె పుట్టింది. ఆమెను చూసేందుకు గత నెల 17 వ తేదీన.. ఆ ఇద్దరు రిటైర్డ్ టీచర్స్ దంపతులు చెన్నైకి వెళ్లారు. అయితే వెళ్తూ వెళ్తూ.. ఇంటి తాళాలను పనిమనిషి సెల్వికి ఇచ్చి వెళ్లారు.


అయితే రోజూ లాగే ఆ రోజు కూడా సెల్వి.. ఆ ఇంటిని శుభ్రం చేసేందుకు వెళ్లి తాళం తీయగా.. దొంగతనం జరిగినట్లు తెలిసింది. తలుపులు పగలగొట్టి ఉండటం, ఇంట్లోని వస్తువులు అన్నీ చిందరవందరగా పడి ఉండటంతో దొంగలు దోచుకుపోయారని అర్థం అయి.. వెంటనే ఆ రిటైర్డ్ టీచర్స్ దంపతులకు సమాచారం అందించింది. వెంటనే వారు ఇంటికి వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు రంగంలోకి దిగి.. దొంగతనం జరిగిన ఆ ఇంట్లో ఆధారాల కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలోనే వారికి ఒక లెటర్ కనిపించింది. అది చదివి పోలీసులతోపాటు ఇంటి యజమాని కూడా అవాక్కయ్యాడు.


ఎందుకంటే ఆ ఇంట్లో దొంగతనం చేసిన దొంగ రాసిన లెటర్ అది. ఆ ఇంట్లో దొంగతనం చేసినందుకు తనను క్షమించాలని ఇంటి యజమానిని ఆ దొంగ వేడుకున్నాడు. అంతేకాకుండా తన భార్యకు ఆరోగ్యం బాగాలేదని.. ఆమెకు చికిత్స అందించేందుకు తప్పని పరిస్థితుల్లో ఈ దొంగతనం చేసినట్లు చెప్పాడు. అంతేకాకుండా తాను ఎత్తుకెళ్లిన డబ్బును నెల రోజుల్లోగా తిరిగి ఇస్తానని రాసి పెట్టాడు. అయితే ఆ ఇంట్లో రూ.60 వేల నగదు, 12 గ్రాముల బంగారు ఆభరణాలు, ఒక జత వెండి పట్టీలు చోరీకి గురైనట్లు యజమాని సెల్విన్ గుర్తించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com