ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బస్సుల్లో ఛార్జీల పెంపుపై రవాణా మంత్రి కీలక ప్రకటన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 26, 2024, 07:52 PM

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. మంత్రులందరూ తమకు కేటాయించిన శాఖల బాధ్యతలు తీసుకుని ప్రజా పాలన ప్రారంభించారు. ఈ క్రమంలోనే తమ శాఖకు సంబంధించి భవిష్యత్తులో తీసుకోబోయే నిర్ణయాలు, ఎలాంటి విధానాలు అనుసరిస్తామనే అంశాలను వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీఎస్ ఆర్టీసీ బస్సు్ల్లో ఛార్జీల పెంపుపై ఏపీ రవాణశాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు వైసీపీ ప్రభుత్వ పాలనలో ఆర్టీసీని నిర్వీర్యం చేశారన్న మంత్రి.. కనీస భద్రతా ప్రమాణాలను కూడా పాటించలేదన్నారు. ఆర్టీసీ సంస్థకు చెందిన భూములను లీజుల పేరుతో కాజేశారని ఆరోపించిన మంత్రి.. అలాంటి భూములను వెనక్కి తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఆర్టీసీ బస్సుల్లో ఛార్జీల పెంపుపై కీలక వ్యాఖ్యలు చేశారు. బస్సు ఛార్జీలు పెంచకుండానే.. సర్వీసులను పెంచి ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిస్తామని చెప్పారు.


మరోవైపు ఎన్నికల్లో గెలిచి తాము అధికారంలోకి వస్తే.. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని టీడీపీ కూటమి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. ప్రస్తుతం టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో ఈ హామీ అమలుపైనా కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. నెలరోజుల్లోపు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. హామీ అమలుపై కమిటీని ఏర్పాటు చేస్తామని.. కమిటీ నివేదిక వచ్చిన తర్వాత హామీని అమలు చేస్తామని చెప్పారు. తాజాగా ఆర్టీసీ బస్సుల్లో టికెట్ ఛార్జీల పెంపు సైతం ఉండదని చెప్పడంతో హర్షం వ్యక్తమవుతోంది.


 అయితే ఉచిత బస్సు ప్రయాణం హామీని ఏ రకంగా అమలు చేస్తారనే దానిపై స్పష్టత లేదు. తెలంగాణ తరహాలో జీరో టికెట్ల విధానం తెస్తారా లేదా .. కర్ణాటక టైపులో ప్రత్యేక కార్డులు తీసుకువస్తారా అనే దానిపై క్లారిటీ లేదు. అలాగే ఉచిత బస్సు ప్రయాణం హామీని కేవలం జిల్లా సర్వీసులకు మాత్రమే పరిమితం చేస్తారా.. లేదా రాష్ట్రవ్యాప్తంగా ఎక్స్‌ప్రెస్, ఆర్డినరీ బస్సుల్లో ఈ విధానం అమలు చేస్తారా అనే దానిపైనా ఆసక్తి నెలకొంది. ఏదేమైనా మరికొన్ని రోజులు ఏపీలో ఉచిత బస్సు ప్రయాణంపై ఎదురుచూడక తప్పదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com