ఏపీలో వైసీపీ కార్యాలయాల అంశం ఇప్పుడు హాట్ టాపిక్గా ఉంది. వైసీపీ తమ కార్యాలయాలను అనుమతులు లేకుండా నిర్మించిందంటూ టీడీపీ ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని కూడా అధికారులు ఇటీవల కూల్చివేశారు. అలాగే వివిధ జిల్లాలలో ఉన్న వైసీపీ కార్యాలయాలకు నోటీసులు అందించారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీకి ఏపీ హైకోర్టు కాస్త ఊరట ఇచ్చింది. వైసీపీ కార్యాలయాల కూల్చివేతలపై ఏపీ హైకోర్టు స్టేటస్ కో విధించింది. రేపటి వరకూ ( జూన్27) యథాతథస్థితిని కొనసాగించాలని ఆదేశించింది. వైసీపీ కార్యాలయాలను కూల్చివేయటం, నోటీసులపై వైసీపీ హైకోర్టును ఆశ్రయించగా.. విచారణ జరిపిన ఏపీ హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఈ అంశం మీద కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
వైసీపీ నేతలు అనుమతులు తీసుకోకుండా, అక్రమంగా కార్యాలయాలను నిర్మిస్తున్నారంటూ ప్రభుత్వ అధికారులు పలుచోట్ల వైసీపీ కార్యాలయాలకు నోటీసులు అంటించారు. నిర్మాణాలపై వివరణలు ఇవ్వాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. దీనిపై అధికార టీడీపీ, విపక్ష వైసీపీ నేతల మధ్య సోషల్ మీడియాలో పెద్ద యుద్ధం నడుస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. వైసీపీ కార్యాలయాలను అక్రమంగా కూల్చివేస్తున్నారని.. పలుచోట్ల నోటీసులు జారీ చేశారంటూ పిటిషనర్ కోర్డు దృష్టికి తీసుకువచ్చారు. మొత్తం 10 జిల్లా కార్యాలయాలకు సంబంధించిన కూల్చివేతలు, నోటీసుల గురించి కోర్టుకు తెలియజేశారు.
ఈ పిటిషన్ మీద బుధవారం ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా ప్రభుత్వం అక్రమంగా వైసీపీ కార్యాలయాలను కూల్చివేస్తోందని పిటిషనర్ తరుఫు లాయర్ వాదించారు. అయితే ఇప్పటికిప్పడు వైసీపీ కార్యాలయాలను కూల్చడం లేదని.. అనుమతులు లేకపోవటంతో నోటీసులు మాత్రమే ఇచ్చినట్లు ప్రభుత్వం తరుఫు లాయర్ వాదించారు. ఈ నేపథ్యంలో ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం.. గురువారం వరకూ ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ స్టేటస్ కో విధించింది. అనంతరం విచారణను జూన్ 27కు వాయిదా వేసింది.