ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సమీక్షలో డిప్యూటీ సీఎంకు షాకిచ్చిన అధికారులు.. ఇచ్చిన జవాబుతో పవన్ విస్మయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 26, 2024, 07:47 PM

వరుస సమీక్షలు, సమావేశాలతో బిజీబిజీగా గడుపుతున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అధికారులు షాక్ ఇచ్చారు. సమీక్షలో అధికారులు చెప్పిన లెక్కలకు జనసేనాని విస్మయానికి గురయ్యారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు షాకిచ్చేలా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఖాతాలో నిధులు ఉన్నాయి మరి. అసలు సంగతిలోకి వస్తే.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బుధవారం స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. మంగళగిరిలోని నివాసంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కార్యక్రమాలు, కార్పొరేషన్ వద్ద ఉన్న నిధులు, వ్యర్థాల నిర్వహణపై సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులు చెప్పిన లెక్కలకు పవన్ కళ్యాణ్ విస్తుపోయారు.


స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఖాతాలో ప్రస్తుతం రూ.7 కోట్లు మాత్రమే ఉన్నట్లు అధికారులు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో పవన్ కళ్యాణ్ విస్మయం వ్యక్తం చేశారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఖాతాలో రూ.2092.65 కోట్ల నిధులు ఉంటే.. ప్రస్తుతం కేవలం రూ.7 కోట్లు మాత్రమే మిగిల్చారా అని ప్రశ్నించారు. కార్పొరేషన్ నిధులు మళ్లింపుపై వివరాలు చెప్పాలని ఆదేశించారు.


2020-21 ఆర్థిక సంవత్సరంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ రూ.728.35 కోట్ల నిధులను వినియోగించింది. అలాగే 2021-22లో రూ.508 కోట్లు ఖర్చు చేశారు. 2021-22 ఆర్థిక సంవత్సరం ముగిసేసరికి కార్పొరేషన్ ఖాతాలో రూ.1066.36 కోట్లు ఖాతాలో ఉన్నాయి. అయితే.. 2022-23 ఆర్థిక సంవత్సరం ప్రారంభం నాటికి కార్పొరేషన్ ఖాతాలో కేవలం రూ.3 కోట్లు మాత్రమే ఉన్నట్లు రికార్డులో ఉంది. అలాగే 2023-24లో కేంద్రం, రాష్ట్రం నుంచి అందిన నిధులు, వాటి వడ్డీతో కలిపి రూ.239 కోట్లు ఉండగా.. వాటిలో రూ.209 కోట్లు ఖర్చు చేశారు. ప్రస్తుతం స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఖాతాలో రూ.7.04 కోట్లు మాత్రమే ఉన్నాయి.ఈ నేపథ్యంలో.. కార్పొరేషన్ ఖాతాలో నిధులు ఏమయ్యాయి. ఎటు మళ్లించారనే దానిపై వివరణ ఇవ్వాలని డిప్యూటీ సీఎం అధికారులను ఆదేశించారు.


 కేంద్రం ఇచ్చిన నిధులను వినియోగించకుండా బ్యాంకు ఖాతాల్లో ఉంచడం, ఆపై ఇతర అవసరాలకు మళ్లించడం దురదృష్టకరమని పవన్ విమర్శించారు. అలాగే ప్రస్తుతం ఉన్న రూ.7 కోట్లు జీతాలకు మాత్రమే సరిపోతాయని.. అభిప్రాయపడ్డారు. కార్పొరేషన్ నిధులు ఎటు మళ్లించారో, ఎవరి ఆదేశాలతో ఆ పని చేశారో తెలియజేయాలని అధికారులను ఆదేశించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com