ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్నేహితులకు రైలు టికెట్లు బుక్ చేస్తే ఫైన్.. ఆ వార్తలు నిజంకావు

national |  Suryaa Desk  | Published : Tue, Jun 25, 2024, 09:59 PM

మనం రైల్వే టికెట్లను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునేటపుడు రైల్వే టికెట్ బుకింగ్, క్యాటరింగ్ సంస్థ - ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్, యాప్ ఉపయోగిస్తాం. అందులో ముందుగా మన పేరుతో అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాతే టికెట్ బుక్ అవుతుంది. అయితే ఆ అకౌంట్ నుంచి మన కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్, తెలిసిన వారికి రైల్వే టికెట్లు బుక్ చేస్తూ ఉంటాం. ఇక గత కొన్ని రోజులుగా ఓ వార్త బాగా వైరల్ అవుతోంది. ఐఆర్‌సీటీసీ పర్సనల్ అకౌంట్ నుంచి మనకు కాకుండా ఇతరులకు రైల్వే ఈ-టికెట్ల బుక్ చేసేవారిపై చట్టపరంగా జైలు శిక్షతోపాటు, భారీగా జరిమానా విధిస్తారు అంటూ ఆ వార్త సారాంశం. అయితే ఇదంతా ఫేక్ అని తాజాగా రైల్వే శాఖ కొట్టిపారేసింది. అలాంటి కొత్త నిబంధనలు ఏవీ తీసుకురాలేదని స్పష్టం చేసింది.


ఇక ఈ-టికెట్ల బుకింగ్ విషయంలో ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్న వార్తలు ప్రయాణికులను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని పేర్కొన్న రైల్వే శాఖ.. ఈ బుకింగ్‌కు సంబంధించి కొన్ని విషయాలు వెల్లడించింది. ఐఆర్‌సీటీసీలో పర్సనల్ అకౌంట్‌ల నుంచి కుటుంబ సభ్యులు, బంధువులు, ఫ్రెండ్స్‌ ఇలా ఎవరికైనా రైల్వే ఈ-టికెట్లు బుక్‌ చేసుకోవచ్చని తెలిపింది. ఒక పర్సనల్ అకౌంట్ నుంచి నెలకు 12 టికెట్లు బుక్ చేసుకునే సదుపాయం ఉంటుందని వెల్లడించింది. ఆధార్‌ అనుసంధానం పూర్తి చేసుకున్నవారైతే నెలలో 24 టికెట్లు వరకూ బుక్‌ చేసుకొనే సదుపాయం ఉంది.


ఈ పర్సనల్ ఐడీలతో బుక్‌ చేసిన ఈ-టికెట్లు బిజినెస్ కోసం ఉద్దేశించినవి కాదని రైల్వే మంత్రిత్వశాఖ తాజాగా స్పష్టం చేసింది. అలాంటి చర్యలకు ఎవరైనా పాల్పడితే.. రైల్వే చట్టం -1989లోని సెక్షన్‌ 143 ప్రకారం నేరంగా పరిగణించి తగిన శిక్షలు ఉంటాయని ట్విటర్ వేదికగా తెలిపింది. ఈ నేపథ్యంలోనే కేవలం రక్త సంబంధీకులు, ఒకే ఇంటిపేరు ఉన్నవారికి మాత్రమే ఐఆర్‌సీటీసీ పర్సనల్ ఐడీ నుంచి రైల్వే ఈ-టికెట్లు బుక్‌ చేసేందుకు అవకాశం ఉందని.. వేరే ఇంటిపేర్లు ఉన్నవారికి బుక్‌ చేయడంపై రైల్వేశాఖ ఆంక్షలు విధించినట్లు జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని.. ఆ వార్తలు నమ్మవద్దని సూచించింది.


ఇంటి పేరుతో సంబంధం లేకుండా పర్సనల్ ఐడీ ఉన్న వ్యక్తులు కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్, బంధువులకు ఉన్న లిమిట్‌కు అనుగుణంగా ఐఆర్‌సీటీసీలో ఈ-టికెట్లు బుక్‌ చేసుకోవచ్చని స్పష్టం చేసింది. అలా కాకుండా ఆ పర్సనల్ అకౌంట్ నుంచి టికెట్లు బుక్‌ చేసి వ్యాపారం చేయాలనుకుంటే మాత్రం తప్పకుండా చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరికలు చేసింది. కేవలం అధికారిక గుర్తింపు పొందిన ఏజెంట్లకు మాత్రమే థర్డ్‌పార్టీ బుకింగ్‌ ద్వారా ఈ-టికెట్లు బుక్ చేసే అవకాశం ఉంటుందని తేల్చి చెప్పింది. వారు మాత్రమే టికెట్లు బుక్‌ చేసి ఇతరులకు విక్రయించే అధికారాన్ని కలిగి ఉంటారని.. ఎవరైనా ఈ నిబంధనల్ని అతిక్రమిస్తే.. చట్టపరమైన చర్యలు ఉంటాయని రైల్వే శాఖ తాజాగా హెచ్చరించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com