ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అంతరిక్షం నుంచి రామసేతు ఎంత అద్భుతంగా కనిపిస్తోంది.. ఫోటో షేర్ చేసిన స్పేస్ ఏజెన్సీ

national |  Suryaa Desk  | Published : Mon, Jun 24, 2024, 10:21 PM

భారత్, శ్రీలంక దేశాల మధ్య ఉన్న రామసేతు కొన్ని వందల ఏళ్ల నుంచి మిస్టరీగానే ఉంది. అది ఎలా ఏర్పడింది అనే దానిపై రకరకాల వాదనలు ఉన్నాయి. పూర్వం రావణుడు సీతను లంకకు తీసుకువెళ్లగా.. సీతాదేవిని తిరిగి తీసుకువచ్చేందుకు రాముడు, లక్ష్మణుడు వానరసేనతో కలిసి లంకకు వెళ్తూ ఈ రామసేతును నిర్మించారని ఎక్కువమంది చెబుతారు. అయితే కొందరు అది అంతా కల్పితమని.. రాముడు నిర్మించలేదని ఖండిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే భారత్, శ్రీలంకలను కలుపుతూ సముద్రంలో ఉన్న ఈ రామసేతు గురించి ఎన్నో వివాదాలు, స్టోరీలు ఉన్నాయి. అయితే తాజాగా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ.. స్పేస్ నుంచి తీసిన రామసేతు ఫోటోను విడుదల చేసింది.


యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన కోపర్నికస్ సెటినల్ 2 శాటిలైట్ అంతరిక్షం నుంచి తీసిన రామసేతు ఫోటో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఈ రామసేతును ఆడమ్స్ బ్రిడ్జి అని కూడా పిలుస్తారు. భారతదేశానికి ఆగ్నేయ తీరంలో తమిళనాడులోని రామేశ్వరం ద్వీపాన్ని.. శ్రీలంకలోని మన్నార్ ద్వీపాన్ని కలుపుతూ 48 కిలోమీటర్ల పొడవు ఈ రామసేతు విస్తరించి ఉంది. ఇది గల్ఫ్ ఆఫ్ మన్నార్(దక్షిణం), హిందూ మహాసముద్రం యొక్క ప్రవేశ ద్వారం, బంగాళాఖాతం యొక్క ప్రవేశ ద్వారం అయిన పాక్ జలసంధి (ఉత్తరం) నుంచి వేరు చేస్తుంది.


అయితే రామసేతు ఎలా ఏర్పడింది అనే దానిపై రకరకాల విశ్లేషణలు ఉన్నప్పటికీ.. ఒకప్పుడు భారత్, శ్రీలంక దేశాలను కలుపుతూ ఉన్న మార్గం కాస్త సముద్రంలో మునిగిపోయిందని.. వాటికి సంబంధించిన సున్నపు రాయి అవశేషాలు ప్రస్తుతం ఉన్నాయని భౌగోళిక ఆధారాలు ఉన్నాయి. 15 వ శతాబ్దం వరకు ఈ బ్రిడ్జి సాధారణంగా రాకపోకలు సాగించేలా ఉందని.. ఆ తర్వాత క్రమంగా ఏర్పడిన తుఫాన్ల కారణంగా కోతకు గురైందని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ పేర్కొంది. ఇక ఈ మార్గంలో కొన్ని ఇసుక తీరాలు పొడిగా ఉన్నాయని.. ఆ ప్రాంతంలో సముద్రం చాలా నిస్సారంగా ఉండి.. లోతు కేవలం 10 మీటర్లు మాత్రమే ఉందని పేర్కొంది. నీటి లేత రంగు సూచించినట్లు పేర్కొంది.


130 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న మన్నార్ ద్వీపం నుంచి శ్రీలంకకు రోడ్డుతో పాటు రైల్వే వంతెన ద్వారా కలిసి ఉంటుంది. ఇక భారత్‌ వైపు రామేశ్వరం ద్వీపం ఉంటుంది. ఇదే పంబన్ ద్వీపంగా కూడా ఫేమస్ అయింది. 2 కిలోమీటర్ల పొడవు ఉన్న ఈ ద్వీపాన్ని పంబన్ బ్రిడ్జి ద్వారా చేరుకోవచ్చు. ఇక్కడ పంబన్, రామేశ్వరం అనే రెండు ప్రధాన పట్టణాలు ఉన్నాయి. రామసేతులో భాగంగా ఉన్న ఈ పంబన్ ద్వీపం, మన్నార్ ద్వీపాలు.. భారత్ శ్రీలంకలోని జాతీయ ఉద్యానవనాల్లో భాగంగా ఉన్నాయి. ఇక ఈ ఏడాది మొదట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రామసేతు ప్రారంభప్రదేశమైన అరిచల్ మునైని సందర్శించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com