ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్‌న్యూస్.. వారికి 6 నెలల పాటు సెలవులు

national |  Suryaa Desk  | Published : Mon, Jun 24, 2024, 10:20 PM

సాధారణంగా ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పనిచేసే మహిళలు ఎవరికైనా గర్భిణీ అయిన తర్వాత ప్రసూతి సెలవులు ఇవ్వాలని చట్టం ఉంటుంది. కొన్ని నెలల పాటు వారికి మెటర్నిటీ సెలవులు ఇస్తారు. కేవలం మహిళా ఉద్యోగులకే కాకుండా.. మగవారికి కూడా పితృత్వ సెలవులు ఉంటాయి. అయితే మహిళలతో పోలిస్తే ఇవి చాలా తక్కువగా ఉన్నప్పటికీ తండ్రులకు కూడా సెలవులు ఇస్తారు. అయితే ఇప్పటివరకు సాధారణంగా తల్లులు అయిన ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే ఈ రూల్ అమలు అయ్యేది. కానీ తాజాగా కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. అద్ద గర్భాలు (సరోగసీ) ద్వారా తల్లులు అయిన వారికి కూడా మెటర్నిటీ లీవులు ఇవ్వాలని నిర్ణయించింది.


సరోగసీ ద్వారా తల్లులైనా ప్రభుత్వ మహిళా ఉద్యోగులు ఇక నుంచి 6 నెలల ప్రసూతి సెలవులు తీసుకోవచ్చని కేంద్రం తెలిపింది. ఇందుకోసం చట్టంలోని 50 ఏళ్ల నాటి నిబంధనను తాజాగా కేంద్ర ప్రభుత్వం సవరించింది. సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (సెలవులు) రూల్స్ 1972లో మార్పుల చేసిన కేంద్రం దాని ప్రకారం.. తల్లి (సరోగసీ ద్వారా బిడ్డకు జన్మనిచ్చే తల్లి) పిల్లల సంరక్షణ కోసం ఈ 6 నెలల పాటు సెలవులు తీసుకునే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా.. తండ్రి కూడా 15 రోజుల పితృత్వ సెలవులు తీసుకోవచ్చు.


అయితే వారికి ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ మంది సంతానం ఉండకూడదని కేంద్రం షరతు విధించింది. ఇక ఈ మార్పులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం గత వారమే నోటిఫికేషన్ జారీ చేయగా.. జూన్ 18 వ తేదీ నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది. అయితే ప్రస్తుతం మారుతున్న కాలానికి అనుగుణంగా.. సరోగసీ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మహిళా ఉద్యోగులకు కూడా ప్రయోజనం కల్పించేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.


సరోగసీ విషయంలో, సరోగసీతో పాటు అలాగే ఇద్దరు పిల్లల కంటే తక్కువ జీవించి ఉన్న తల్లికి 180 రోజుల ప్రసూతి సెలవులు మంజూరు చేయవచ్చని కేంద్రం వెల్లడించింది. కాగా సరోగసీ ద్వారా బిడ్డ పుడితే ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులు మంజూరు చేయాలనే నిబంధన ఇప్పటివరకు లేకపోవడం గమనార్హం. మహిళల మొత్తం ప్రభుత్వ ఉద్యోగ కాలంలో చైల్డ్ కేర్ లీవ్ కోసం గరిష్ఠంగా 730 రోజుల పాటు సెలవులు తీసుకోవచ్చని తెలిపింది. ఇందులో పిల్లల అవసరాలు, చదువు, అనారోగ్యం సహా ఇతర సమయాల్లో ఈ లీవులను వాడుకోవచ్చని కేంద్రం పేర్కొంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com