ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేశంలోనే అతిపెద్ద వినాయకుడు.. మన దగ్గరే.. ఎంత ఎత్తంటే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 24, 2024, 09:20 PM

యావత్ భారతావని గణేశ్ పండగ కోసం సిద్ధమవుతోంది. సెప్టెంబర్ ఏడో తేదీన వినాయక చవితి పండుగ జరగనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలుచోట్ల గణేష్ విగ్రహాల తయారీ మొదలైపోయింది. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఖైరతాబాద్ గణేషుడి కోసం ఇటీవలే కర్రపూజ కూడా నిర్వహించారు. అయితే దేశంతోనే అతిపెద్ద విగ్రహాన్ని మన తెలుగు రాష్ట్రాల్లోనే ఏర్పాటు చేయనున్నారు. విశాఖపట్నంలో దేశంలోనే అతిపెద్ద వినాయకుడు కొలువుదీరనున్నాడు. వినాయక చవితి సందర్భంగా గాజువాకలోని లంక గ్రౌండ్స్‌లో గణేష్ ఉత్సవాల నిర్వాహకులు సుమారు 125 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ప్రతిష్టించాలని నిర్ణయించారు. 2023లో వైజాగ్‌లో ఏర్పాటు చేసిన 117 అడుగుల శ్రీ అనంత పంచముఖ మహా గణపతి విగ్రహం.. దేశంలోనే అత్యంత ఎత్తైన పర్యావరణహిత గణేష్ విగ్రహంగా రికార్డుల్లోకి ఎక్కింది. అయితే ఈసారి అంతకంటే ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఉత్సవ కమిటీ నిర్వాహకులు నిర్ణయం తీసుకున్నారు.


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వినాయక చవితి అనగానే అందరికీ ఖైరతాబాద్ గణేశుడు గుర్తుకు వచ్చేవాడు. అయితే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత విశాఖ గణేశుడు కూడా అంతే స్థాయిలో ప్రాముఖ్యత సంపాదించుకున్నాడు. 2023లో గాజువాకలోని లంకా గ్రౌండ్స్‌లో 117 అడుగుల వినాయకుణ్ని ప్రతిష్టించారు. ఇక ఈ భారీ గణనాథుడి వద్ద ఉంచిన 117 కేజీల లడ్డూ వేలంలో రూ.11 లక్షలు పలికింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది అంతకంటే ఎత్తైన గణేష్ విగ్రహాన్ని ప్రతిష్టించాలని ఆలయ కమిటీ నిర్ణయం తీసుకుంది.


విగ్రహ ఏర్పాటు కోసం ఆదివారం తొలి పూజ నిర్వహించారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన 30 మంది కళాకారులు ఈ భారీ విగ్రహాన్ని రూపొందించనున్నారు. అలాగే మరో 15 మంది కళాకారులు అలంకరణలో పాలుపంచుకోనున్నారు. ఈ 125 అడుగుల వినాయకుడి విగ్రహాన్ని మట్టి, ఎండు గడ్డి, చెక్క ముక్కల మిశ్రమంతో తయారు చేయనున్నారు. అలాగే విగ్రహం బరువును తట్టుకునే విధంగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ స్వల్ప మొత్తంలో ఉపయోగించనున్నారు. అయితే ఏ ఇతివృత్తంలో వినాయకుడి ప్రతిమ ఉంటుందనేదీ విగ్రహం 70 శాతం పూర్తైన తర్వాత వెల్లడిస్తామని ఉత్సవ నిర్వాహక కమిటీ తెలిపింది. విగ్రహం తయారీకి కనీసం రెండు నెలల సమయం పడుతుందని కమిటీ సభ్యులు తెలిపారు. అలాగే రూ.40 లక్షల వ్యయంతో ఈ 125 అడుగుల వినాయకుడి విగ్రహాన్ని రూపొందిస్తున్నట్లు చెప్పారు. ఇందుకోసం విరాళాలను సేకరించనున్నట్లు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com